KCR Nagar | మురికివాడలను చీల్చుకుని మొలిచిన భువన భవనం బస్తీ పేదల ఆత్మగౌరవాన్ని ఆకాశమెత్తు నిలిపిన హర్మ్యం ఆసియాలోనే అతిపెద్ద నివాస గృహ సముదాయం
సంక్షేమ సన్నివేశానికి ఇది శిఖరాయమాన దృశ్యం కొల్లూరు.. ఊరు కాదు.. ఓ మహానగరి! ఏ సిటీ ఇన్ అవర్ సిటీ!.. ఏ సిటీ విత్ డిగ్నిటీ!
కబూతర్ఖాన లాంటి ఇరుకు గదులు కావవి.. నిఖార్సయిన డబుల్ బెడ్రూం ఇండ్లు. అత్యద్భుత వసతులతో ఒకేచోట 15,600 గృహాలతో నిర్మించిన భారీ టౌన్షిప్. ప్రపంచస్థాయి గేటెడ్ కమ్యూనిటీకి ఏమాత్రం తక్కువకాని ఇంద్రభవనాలివి. కమ్యూనిటీ హాల్స్, షాపింగ్ మాల్సే కావు.. నర్సింగ్హోం, మార్కెట్, పెట్రోల్బంక్, పోస్టాఫీసు, పార్కులు, ప్లేగ్రౌండ్, అంగన్వాడీ ప్లేస్కూల్, రైతుబజార్.. నగరంలో ఉన్న వసతులన్నింటినీ అక్కడ సమకూర్చింది రాష్ట్ర ప్రభుత్వం. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసింది. దశాబ్దాలుగా పాలకుల మాటలు, నిపుణుల ప్రణాళిక కాగితాలకే పరిమితమైన దేశంలో ‘ప్రణాళికబద్దమైన పట్టణా’నికి నిలువెత్తు నిదర్శనం కొల్లూరు టౌన్షిప్! గరీబ్థ్.్ర. గరీబ్ కల్యాణ్ యోజన అంటూ ప్రభుత్వాలే చిన్నచూపు చూస్తున్న వేళ కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సిసలైన డిగ్నిటీ హౌసింగ్ కాలనీ..! కొల్లూరు కేసీఆర్నగర్ టౌన్షిప్పై ‘నమస్తే తెలంగాణ’ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధులు గుండాల కృష్ణ, వర్ధెల్లి బాపురావు.. ఫొటోగ్రాఫర్ రజనీకాంత్తో కలిసి అందిస్తున్న ప్రత్యేక కథనమిది..
ఓ బైక్ వేసుకొని ఔటర్ రింగ్రోడ్డు ఎక్కి సంగారెడ్డి జిల్లా కొల్లూరు వైపు అలా వెళ్తుంటే భారీ ఇండ్ల సముదాయం కనిపిస్తది. అక్కడ ఇండ్లన్నీ ఒకేలా ఉంటాయి, విశాలమైన రోడ్లు ఉంటాయి. దగ్గరికి వెళ్లి చూస్తే, ఇన్నర్, ఔటర్ రోడ్లు స్వాగతం పలుకుతాయి, షాపింగ్ కాంప్లెక్స్లు దర్శనమిస్తాయి, వాకింగ్ ట్రాక్లు, బైక్ పార్కింగ్ సదుపాయం, ఫంక్షన్ హాళ్లు.. ఇలా సకల సౌకర్యాలుంటాయి. ఇవన్నీ చూసి అదేదో ప్రైవేట్ టౌన్షిప్ అనుకుంటే పొరపాటే. పేదోడు ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించేలా తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం అది. అవును! కార్పొరేట్ కంపెనీలు కట్టే లగ్జరీ ఇండ్లకు ఏమాత్రం తగ్గకుండా రాష్ట్ర సర్కారు నిర్మించిన పేదల ఇండ్లు అవి.
జనాభాపరంగా చూస్తే హైదరాబాద్ చుట్టూ ఉన్న అనేక మున్సిపాలిటీల కన్నా కొల్లూరు టౌన్షిప్ పెద్దది! ప్రభుత్వం అనుకుంటే మున్సిపాలిటీ అయ్యే అన్ని అర్హతలు ఈ టౌన్షిప్కు ఉన్నాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): గల్లీ చిన్నదీ.. గరీబోళ్ల కథ పెద్దది.. అంటూ ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న హైదరాబాద్లో నిరుపేదల బతుకు చిత్రాన్ని పాటతో కండ్లకు కట్టారు. కానీ ఇప్పుడు గల్లీ మాయమైంది. గరీబోళ్ల కథే మారిపోయింది. గల్లీలు పెద్దగై 30-120 ఫీట్ల రోడ్లు వచ్చినయ్. అగ్గిపెట్టెలాంటి ఇండ్ల స్థానంలో డబుల్ బెడ్రూం విత్ అటాచ్డ్ బాత్రూం వచ్చి చేరింది. ఎత్తయిన భవనాలు, 24 గంటల కరెంటు, నీళ్ల సరఫరా, సీసీ కెమెరాల నిఘా.. ఒక్కటేమిటి! రూ.కోట్ల విలువైన విల్లాలు ఉండే గేటెడ్ కమ్యూనిటీల్లో, మాటకొస్తే అంతకుమించి మౌలిక వసతులున్నాయి సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల టౌన్షిప్లో. అక్కడ వాడుతున్న లిఫ్ట్ కూడా ప్రగతిభవన్, సచివాలయంలో ఉన్న లిఫ్ట్ కంపెనీదే అంటే సౌకర్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ డబుల్ బెడ్రూం ఇంటికొచ్చిన కొత్త చుట్టానికి ఇక్కడి సదుపాయాలు చూసి మైండ్ బ్లాంక్ అవటం ఖాయం. అనేక రంగాల్లో నూతన అధ్యాయాలను లిఖించిన తెలంగాణ ప్రభుత్వం.. నిరుపేదలకు ఆత్మగౌరవ సౌధాలను నిర్మించడంలోనూ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా, ఆసియాలోనే అతి పెద్ద డబుల్ బెడ్రూం ఇండ్ల టౌన్షిప్ను కొల్లూరులో నిర్మించి, నిరుపేదలకు కానుకగా ఇచ్చింది. దీన్ని చూస్తుంటే మరో కొత్త పట్టణం కొలువుదీరినట్టు కనిపిస్తుంది.
ప్రణాళిక అంటే ఇలా ఉంటది
పేదల ఇల్లు అంటే పిట్ట గూడు కట్టిచ్చి, ఇదే స్వర్గం అని చూపించి, ప్రచారం చేసుకొనే రాజకీయం నేటిది. కానీ, పేదోడి ఇల్లు అంటే ఆత్మగౌరవ ప్రతీక అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కార్పొరేట్ స్థాయిలో పేదలకు ఇండ్లు నిర్మించారు. హంగు, ఆర్భాటం ప్రచారంలో కాదు.. కట్టించే ఇంటిలో ఉండాలని నిరూపించారు. ఆ ఇండ్లు ఎంత ప్రణాళికాబద్ధంగా కట్టారంటే.. టౌన్షిప్ విస్తీర్ణంలో 37 శాతం మాత్రమే బిల్టప్ ఏరియా. మిగతా ప్రాంతమంతా రోడ్లు, వాకింగ్ ట్రాక్లు, పచ్చదనం, ఆహ్లాదానికి సంబంధించినవే. 2018 ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ బాధ్యతలు తీసుకొన్నది. ఈ టౌన్షిప్ నిర్మాణానికి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆర్కిటెక్ట్గా వ్యవహరించింది. ఈ ప్రాజెక్ట్ కోసం 3 షిఫ్టుల్లో 6 వేల మంది కార్మికులు పనిచేశారు. 500మంది స్టాఫ్ ఉద్యోగులు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలుమార్లు ఇక్కడ సందర్శించి, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకొని, అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.
స్తంభాల లొల్లే ఉండదు
సాధారణంగా కాలనీలు, టౌన్షిప్ల్లోకి వెళ్లగానే రోడ్డు పక్కన కరెంటు స్తంభాలు, వేలాడే వైర్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద లావుగా ఉండే తీగలు కనిపిస్తాయి. కానీ ఈ టౌన్షిప్లో ఎక్కడా ఒక స్తంభం గానీ, కరెంటు వైర్లు గానీ బయటకు కనిపించవు. 33/11 కేవీ సబ్స్టేషన్ నుంచి అండర్గ్రౌండ్లోనే విద్యుత్తు కేబుళ్లను ఏర్పాటు చేశారు. ఐఎస్ఐ ప్రమాణాలతో కూడిన కేబుళ్లను వినియోగించారు. వీటి కోసం రోడ్డుకు ఒకవైపు డక్ట్లను ఏర్పాటు చేశారు. ఇందులోనే సీసీ కెమెరాలు, ఇతరత్రా వైర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
పరిఢవిల్లుతున్న పచ్చదనం
కేసీఆర్నగర్లో అడుగుపెట్టగానే పచ్చం దాలు కనువిందు చేస్తాయి. టౌన్షిప్ నలువైపులా ఏపుగా పెరిగిన చెట్లు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రావి, మర్రి, వేప, కానుగ, చింత, తులసి, లెమన్గ్రాస్, లావెండర్, దానిమ్మ, నిమ్మ, వేప, నందివర్ధనం, జాస్మిన్, మందారం వంటి మొక్కలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 31 వేల మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించారు.
ప్రతి చిన్న అంశంలోనూ రక్షణ చర్యలు
టౌన్షిప్లో పలు చోట్ల చేపటిన రక్షణ చర్యలను చూస్తే ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకున్నదో అర్థం అవుతుంది. సాధారణంగా ప్రైవేటు అపార్టుమెంట్లలోనూ విద్యుత్తు మీటర్లను అపార్టుమెంటు గ్రౌండ్ఫ్లోర్లో బహిరంగంగానే ఉంచుతారు. కానీ ఇక్కడ ప్రతి బ్లాకులోని మీటర్లన్నింటినీ ఒక గదిలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు ప్రతి బ్లాకు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ బలమైన ఫెన్సింగ్ను ఏర్పాటు చేశారు.
పుష్కలంగా తాగునీరు
ప్రతి మనిషికి 150 ఎల్పీసీడీ ప్రామాణికంగా తీసుకుని అందుకు తగ్గట్లుగా మంచినీటి వసతిని సమకూర్చారు. శామీర్పేట-కోకాపేట వరకు 3,000 ఎంఎం రింగ్మెయిన్ పైపులైన్ మార్గంలో భాగంగా కొల్లూరు ఔటర్ సమీపంలో 300 ఎంఎం డయా పైపులైన్ను అనుసంధానించి టౌన్షిప్కు తాగునీటిని మళ్లించారు. 10.5 కిలోమీటర్ల మేర పైపులైన్ వ్యవస్థతో టౌన్షిప్ ముందు 750 కిలోలీటర్ల మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఓవర్హెడ్ ట్యాంకును నింపుతారు. అక్కడి నుంచి టౌన్షిప్లో 12,500 కిలోలీటర్ల సామర్థ్యంతో నిర్మించిన 12 సంపులను గ్రావిటీ ద్వారా నింపుతారు. ఆపై 150 హెచ్పీ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన మోటర్ల ద్వారా ప్రతి బ్లాకుపై నిర్మించిన లక్ష లీటర్ల సామర్థ్యమున్న ట్యాంకుల్లోకి పంపింగ్ చేస్తారు. అక్కడి నుంచి ప్రతి ఫ్లాట్కు నీరు అందుతుంది. ఈ టౌన్షిప్లో నీటి వినియోగం రోజుకు 1.17 కోట్ల లీటర్లుగా అధికారులు అంచనా వేశారు.
వర్షపు నీటి బొట్టు ఆగకుండా..
టౌన్షిప్లో వాననీటి సంరక్షణ చర్యల్లో భాగంగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడంతో పాటు వరద నీరు సాఫీగా వెళ్లేందుకు 10.55 కిలోమీటర్ల మేర వరద కాల్వలను ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన వరద నీటి కాల్వల్లోకి రోడ్లపై పడిన వర్షపు నీరు వెళ్లేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
నిర్వహణ భారం తగ్గేలా..
టౌన్షిప్లో లిఫ్టుల మరమ్మతులు, ఇతరత్రా నిర్వహణ వ్యయం భారం ప్రజల మీద పడకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొన్నది. 5,400 చదరపు అడుగుల్లో 3 షాపింగ్ కాంప్లెక్స్లలో 118 దుకాణాలను నిర్మించింది. వీటిని వేలం ద్వారా అద్దెకు ఇచ్చి, తద్వారా వచ్చే మొత్తాన్ని ప్రత్యేకంగా తెరచిన బ్యాంకు అకౌంట్లో జమ చేస్తారు. తెల్లాపూర్ మున్సిపాలిటీకి పారిశుద్ధ్య బాధ్యతలను అప్పగించనుండగా, ఇతరత్రా నిర్వహణకు ఈ ఖాతా నుంచి డబ్బులను వినియోగిస్తారు. టౌన్షిప్ నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా అగ్నిప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. ప్రతి బ్లాక్లో సంబంధిత శాఖ నిబంధనల ప్రకారం పరికరాలను ఏర్పాటు చేశారు.
పక్కా వాస్తు
ఈ టౌన్షిప్ నిర్మాణం ఆద్యంతం వాస్తు ప్రకారమే జరిగింది. అందుకే 15 వేలకు పైగా ఉన్న ఫ్లాట్లలో ఏ ఒక్కదానిలోకి వెళ్లినా గాలి, వెలుతురు విస్తారంగా ఉంటుంది. వాస్తుకు అనుగుణంగా నిర్మాణాన్ని చేపట్టడం వల్ల 117 బ్లాకుల్లో ఈశాన్యం వైపు ఉన్న వాటిలో తక్కువ బ్లాకులు.. ఆపై క్రమేణా పెరుగుతూ ఉన్నాయి. వాస్తుతో పాటు గాలి, వెలుతురు మంచిగా వచ్చేందుకే బ్లాకులను యు, ఎల్, ఓ ఆకారంలో చేపట్టారు.
పర్యావరణహితం
టౌన్షిప్ నిర్మాణంలో వాడిన స్టీల్, సిమెంటు, ఇసుక, ఇటుక వంటి ప్రతీది ఐఎస్ఐ మార్కు ఉన్నవే వాడారు. ముఖ్యంగా వీటి పరీక్షల కోసం ఆ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా ఒక ల్యాబ్ను ఏర్పాటు చేసి, నాణ్యతను పరిశీలించారు. థర్డ్ పార్టీ కంట్రోల్ కింద జేఎన్టీయూ, ఈపీటీఆర్ఐ నిపుణుల బృందం కూడా పరీక్షలు చేపట్టి నాణ్యతను ధ్రువీకరించాయి. పర్యావరణహితంగా ఉండేందుకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో కర్ర, టింబర్ వినియోగించలేదు. ఫ్లైయాష్ బ్రిక్స్ను వినియోగించారు.
అడుగడుగునా నిఘా..
సకల సదుపాయాల టౌన్షిప్
ఒక్క క్షణమూ కరెంటు పోదు
మురుగు నీటి పునర్వినియోగం
షిండ్లర్ లిప్టులు
చరిత్రలో ప్రభుత్వం నిర్మించిన గృహ సముదాయాల్లో లిఫ్ట్లు వాడింది లేదు. కానీ ఈ టౌన్షిప్లో ప్రతి బ్లాక్కు రెండు చొప్పున లిఫ్టులు వాడటం
ఒక విశేషమైతే.. ప్రగతిభవన్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వాడుతున్న అత్యున్నత ప్రమాణాలతో కూడిన లిఫ్టులను ఇక్కడ వాడటం మరో విశేషం. ఇక్కడ వినియోగించిన ‘షిండ్లర్’ లిఫ్టుల ఒక్కో దాని ఖరీదు సుమారు రూ.20 లక్షలు. ఇందులో మొత్తం 117 బ్లాక్లు ఉండగా.. ఒక్కో బ్లాక్లో రెండు వైపులా కలిసి 234 షిండ్లర్ లిప్టులను ఏర్పాటు చేశారు. ఒక్కో లిఫ్టులో ఒకేసారి 8 మంది వెళ్లవచ్చు.
దేశానికే ఆదర్శం
కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకే చోట 15,660 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో నాణ్యతలో రాజీపడకుండా అత్యున్నత ప్రమాణాలతో ఈ ప్రాజెక్టు జరిగింది.
– కే సురేశ్కుమార్, జీహెచ్ఎంసీ హౌసింగ్ ఓఎస్డీ
రూ.50 లక్షల విలువైన ఇల్లు ఉచితంగా..
పేదల ఇండ్లు అంటే ఒకప్పుడు జీ+2లో వాంబే, జేఎన్ఎన్యూఆర్ఎం నిర్మాణాలు జరగగా.. ఒక్కో ప్లాట్ 237 – 338 చదరపు అడుగుల విస్తీర్ణమే ఉండేవి. వీటి కోసం లబ్ధిదారులు 30 శాతం, 20 శాతం బ్యాంకు గ్యారంటీ, 50 శాతం సబ్సిడీ అంటూ సవాలక్ష ఆంక్షలు ఉండేవి. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.8.65 లక్షలు ఖర్చు చేసి ఖరీదైన ఇంటిని పేదోడికి ఉచితంగా కేటాయిస్తున్నది. ఈ టౌన్షిప్ పరిసరాల్లో చదరపు గజం విలువ కనీసం రూ.40 వేల పైమాటే. అంటే.. ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటి విలువ రూ.50 లక్షల వరకు ఉంటుంది. మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకుంటే ఇంకా ఖరీదే.
ఈ టౌన్షిప్ రాత్రికిరాత్రే ఒక మున్సిపాలిటీగా ఏర్పాటుకానున్నది.. సుమారు 60 వేల మందికిపైగా జనాభా ఉండనుండటంతో మున్సిపాలిటీకి ఉండే అర్హతలన్నీ ఈ టౌన్షిప్ సాధించనున్నది. ఎలాగూ మౌలిక వసతుల కల్పన జరిగినందున హోదా ఇవ్వడమే తరువాయిగా ఉండనున్నది. ఒకవేళ ఈ టౌన్షిప్ను మున్సిపాలిటీగా ప్రకటిస్తే రాష్ట్రంలో 33వ అతి పెద్ద మున్సిపాలిటీగా ఇది అవతరిస్తుంది. అందుకే ఈ టౌన్షిప్కు ఇప్పటికే అన్ని వసతులు ఉన్న అతి పెద్ద గృహ సముదాయంగా హడ్కో అవార్డును ఇచ్చింది.
ప్రతి ఫ్లోర్కు ఫైర్ సేఫ్టీ.. అడుగడుగున సీసీ కెమెరాల నిఘా.. ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్.. పెట్రోల్ బంక్, పోస్టాఫీస్.. బస్టాప్, బస్ టెర్మినల్.. బతుకమ్మ ఘాట్, హాస్పిటల్..రైతుబజార్, మిల్క్ బూత్.. స్కూల్, లైబ్రరీ, పార్కు..వాకింగ్ ట్రాక్, ప్లే గ్రౌండ్.. ఓపెన్ జిమ్ ఇండోర్ కాంప్లెక్స్.. సకల సౌకర్యాలకు నెలవు కొల్లూరు టౌన్షిప్! కేసీఆర్ కట్టించిన పేదోళ్ల ప్యాలెస్!!