హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : ఆందోళనలు.. నిరసనల ప్రభావంతో టెట్ ఫీజులు తగ్గిస్తారనుకొన్న నిరుద్యోగుల ఆశలను రేవంత్ సర్కారు వమ్ముచేసింది. టెట్ ఫీజులను తగ్గించబోమని సంకేతాలిచ్చింది. టెట్ పేపర్1కు రూ.1,000, టెట్ రెండు పేపర్లకు రూ.2 వేలు ముక్కుపిండి వసూలు చేసేందుకు సిద్ధపడింది. టెట్ ఫీజులు పెంచడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, అభ్యర్థులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.
150శాతం నుంచి 300శాతం ఫీజుల పెంపును నిరసిస్తూ బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పోరాడుతున్నారు. పుస్తకాలు వదిలి రోడ్డకెక్కి ఉద్యమిస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఈ ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నాయి. ఈ పోరాటాలకు ప్రభుత్వం దిగి వచ్చి టెట్ ఫీజులను తగ్గిస్తుందని అంతా భావించారు. బుధవారం నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్నది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఫీజుల తగ్గింపుపై స్పష్టమైన ప్రకటన ఉంటుందని అంతా ఆశించారు. కానీ, ఫీజుల తగ్గింపుపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీనిపై అధికారులను ఆరా తీస్తే ఇంతవరకు తమకేం సమాచారం లేదని, రూ.వెయ్యి, రూ.2 వేల ఫీజును కట్టాల్సిందేనని స్పష్టంచేశారు. నిరుద్యోగులు ఇంతగా మొత్తుకొంటున్నా.. గగ్గొలుపెడుతున్నా.. రేవంత్ సర్కారు పట్టించుకోకపోవడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధిచెబుతామని హెచ్చరిస్తున్నారు.
ఏపీలో రూ. 750 ఫీజు మాత్రమే
టెట్ ఫీజులు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలతో సమానంగా ఉన్నాయి. మన పక్కనే ఉన్న ఏపీలో టెట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. అక్కడ ఒక్కో పేపర్కు రూ. 750 మాత్రమే ఫీజుగా తీసుకొంటున్నారు. కానీ మన దగ్గర రూ.1000 తీసుకోవడం గమనార్హం. కనీసం ఎస్సీ, ఎస్టీలు, వికలాంగులకు ఫీజులో రాయితీ ఇవ్వడంలేదు. జాతీయంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ పరీక్షకు రూ.వెయ్యి ఫీజుగా వసూలు చేస్తున్నారు.
టెట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. దీని వల్ల ఉద్యోగాలొచ్చేది లేదు.. ఇస్తారన్న గ్యారంటీ లేదు. కేవలం వెయిటేజీ మాత్రమే ఉంటుంది. దీనికి వెయ్యి రూపాయలెందుకన్న ప్రశ్నలు నిరుద్యోగుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. పైగా టెట్ను రాష్ట్రంలోని 11 జిల్లా కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తారు. అంటే టెట్ పరీక్ష రాయాలంటే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణం చేయాల్సిందే. అంటే ప్రయాణ భారం అదనంగా పడనున్నది. దీనిపైనా నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు.
ఆన్లైన్తోనే.. అమాంతం..
టెట్ను ఇది వరకు ఆఫ్లైన్లో నిర్వహించడంతో పరీక్ష ఫీజు రూ. 200, 300, 400గా మాత్రమే ఉండేది. కానిప్పుడు తొలిసారిగా టెట్ను ఆన్లైన్లో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. దీంతో టెట్ పరీక్షలను టీసీఎస్ ఆయాన్ కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తారు. ఈ పరీక్షను నిర్వహించినందుకు టీపీఎస్ ఆయాన్ ఒక్కో విద్యార్థిపై రూ. 495 ఫీజుగా వసూలు చేస్తుంది. ఆన్లైన్లో నిర్వహించడంతో 18 శాతం జీఎస్టీ పడుతుంది.
ఇలా పరీక్షను ఆన్లైన్కు మార్చడంతో టెట్ ఫీజులు అమాంతం పెరిగాయి. పైగా ఆఫ్లైన్లో పరీక్షలను నిర్వహిస్తే పేపర్ లీకవుతుందన్న ఆందోళన ప్రభుత్వాన్ని వెన్నాడుతున్నది. పేపర్లు లీకైతే ప్రభుత్వం బద్నాం కావాల్సి ఉంటుందన్న ఆలోచనతోనే ఆన్లైన్లో పరీక్షను నిర్వహించేందుకు ప్రభుత్వం మెగ్గుచూపింది. కానీ ఈ వ్యుహాత్మక తప్పిదంతో అసలుకే మోసానికి దారితీస్తున్నది. స్థూలంగా నిరుద్యోగుల ఆగ్రహానికి, ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతున్నది.
టెట్ ఫీజులు మంచినీళ్ల ప్రాయం..
ఇక టెట్ ఫీజులను విద్యాశాఖ అధికారులు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చుచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇష్టారీతిన ఖర్చుపెడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో నిరుద్యోగ అభ్యర్థుల నుంచి కోట్లల్లో వసూలు చేసిన ఫీజుల్లో కొంత మొత్తాన్ని విద్యాశాఖ కార్యాలయాల్లో మరమ్మతులు, కోర్టు కేసులకు వాడినట్టుగా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కార్యాలయ నిర్వహణకు విద్యార్థుల సొమ్ములేంటని ప్రశ్నిస్తున్నాయి.
టెట్ డబ్బులు అంటేనే విద్యాశాఖకు అక్షయపాత్ర అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, హైదరాబాద్ ఆర్జేడీ కార్యాలయంలో ఏసీలకు రూ. 8లక్షలు ఖర్చుచేశారని పేర్కొంటున్నాయి. 15 ఏండ్లుగా ఇష్టారీతిన ఖర్చుచేస్తున్నారని మండిపడుతున్నాయి. టెట్ వ్యయంలోనూ భారీగా అవినీతి జరిగి ఉంటుందని, ఆడిటింగ్ నివేదికలను బయటపెట్టాలని, విచారణ చేపట్టాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పేద విద్యార్థులపై పెనుభారం
టెట్ ఫీజులను పెంచడం వల్ల నిరుపేద విద్యార్థులపై పెనుభారం పడుతుంది. ఒక పేపర్కు వెయ్యి, రెండు పేపర్లకు రెండు వేలు పెంచడం అత్యంత దారుణం. దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రూపాయి ఫీజు తీసుకోబోమని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారు. కానిప్పుడు ఎన్నికల హామీకి విరుద్ధంగా టెట్ ఫీజులను పెంచారు. వెంటనే టెట్ ఫీజులు తగ్గించాలి. లేదంటే ఆందోళనలు ఉదృతం చేస్తాం.
– మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధిచెబుతాం
ప్రభుత్వం నుంచి మేం ఆశించింది వేరు.. అధికారంలోకొచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది వేరు. ప్రజా ప్రభుత్వమంటే ఇట్లా ఉంటుందని మేం అస్సలు అనుకోలేదు. మమ్మల్ని ఎన్నికల్లో పావులుగా వాడుకొని ఇప్పుడు వదిలేశారు. కనీసం మా ఆందోళనలను, నిరసనలను పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణం. అధికారదర్పంతో ఫీజులు పెంచిన సర్కారుకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధిచెబుతాం.
– ఐలీ కవిత, నిరుద్యోగి, హైదరాబాద్
అంతా ఫీజు ఎక్కడి నుంచి తేవాలి
నిరుద్యోగినైన నేను అష్టకష్టాలు పడి టెట్, డీఎస్సీకి ప్రిపేరవుతున్నా. ఇప్పటికిప్పుడు టెట్ కోసం వెయ్యి, రెండు వేలు ఎక్కడి నుంచి తేవాలి. నిరుద్యోగులకు ఫీజు మినహాయింపు ఇస్తామని అధికారంలోకి వచ్చిన ఈ పభుత్వం ఇప్పుడు ఎందుకివ్వడంలేదు. ప్రభుత్వంపై మేం ఎంతో నమ్మకం పెట్టుకొంటే మా నమ్మకాలను పూర్తిగా వమ్ముచేశారు. ఆఖరుకు మాపై ఫీజుల భారం మోపారు. ఇంత కంటే మోసం మరొకటి ఉండదు.
– రమేశ్, నిరుద్యోగ అభ్యర్థి