వేములవాడ/ఝరాసంగం: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో రాజన్న దర్శనానికి ఆరు గంటల సమయం పడుతున్నది.
ఇక ఝరాసంగంలోని సంగమేశ్వర ఆలయం శ్రావణ శోభ సంతరించుకున్నది. చివరి సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు.