ములుగు: వనదేవతలు కొలువై ఉన్న మేడారానికి (Medaram jatara) భక్తులు పోటెత్తారు. జాతర ప్రారంభం కాకముందే సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. మేడారానికి చేరుకున్న భక్తులు జంపన్న వాగులో ఇరువైపులా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దె వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో సమ్మక్క దేవత గద్దె వద్ద భక్త జన సందోహం నెలకొన్నది.
భక్తులు పెద్దసంఖ్యలో తరలి రావడంతో జాతర పరిసరాలు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం జాతర జరగనుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారానికి దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలోనే సమ్మక్క సారక్క జాతర కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.