నిజామాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్ రాకతో ఉద్యమాల గడ్డ ఇందూరు పరవశించింది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు నిజామాబాద్ జిల్లా బ్రహ్మరథం పట్టింది. అడుగడుగునా పూలవర్షంతో ఘనస్వాగతం పలికింది. హోరెత్తిన జన నినాదాలతో, గులాబీ గుబాళింపు మధ్య కేసీఆర్ బస్సుయాత్ర ఆద్యంతం సందడిగా సాగింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్షో విజయవంతమైంది. గులాబీ జెండాలు చేతబూనిన జనంతో దారులన్నీ కిక్కిరిసిపోవడంతో గులాబీ వనమా, జన సంద్రమా.. అన్న ఆశ్చర్యం కలిగింది. గులాబీ దళపతిని చూసేందుకు, కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు వచ్చిన వారితో రోడ్లన్నీ నిండిపోయాయి. నిజామాబాద్ నెహ్రూ చౌక్ వద్ద అశేష జనవాహినిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన ప్రసంగం ఆద్యంతం కట్టి పడేసింది.
తనదైన శైళిలో కేసీఆర్ సంధించిన వాగ్బాణాలకు చప్పట్ల వర్షం కురిసింది. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ద్వంద్వ రాజకీయాలను కేసీఆర్ తన ప్రసంగంలో ఎండగట్టారు. కాంగ్రెస్ హామీల అమలులో జాప్యాన్ని, మోసాన్ని కండ్లకు కట్టినట్టుగా ప్రజలకు వివరించారు. ఐదు నెలల రేవంత్రెడ్డి పాలనలో దగా పడుతున్న రైతులు, ఇతర వర్గాల ప్రజల సాధక బాధకాలను గులాబీ అధినేత విడమరిచి చెప్పారు. దాదాపుగా అరగంటపాటు సాగిన కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలంతా ఆసక్తిగా విన్నారు. సందర్భోచితంగా కేసీఆర్కు జై కొడుతూ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్న కేసీఆర్ పిలుపునకు జనం చేతులెత్తి మద్దతు ప్రకటించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ మోసాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రసంగంలో ఎండగట్టారు. బీజేపీ చెప్పినట్టు తాను వినలేదని తన బిడ్డ కవితను అరెస్ట్ చేసి జైల్లో వేశారని, తాను ఎన్నటికీ, ఎవ్వరికీ లొంగనని, పోరాటాన్ని ఉధృతం చేస్తానన్న కేసీఆర్ మాటకు జనమంతా చప్పట్లతో జేజేలు పలికారు. నేను హిందువును.. తెలంగాణ ప్రజలకు ఆత్మబంధువును.. అనగానే జే కేసీఆర్ అన్న నినాదాలు మిన్నంటాయి. కాంగ్రెస్ ఐదు నెలల పాలన వైఫల్యాలను ఎండగడుతూ, కేంద్రంలోని బీజేపీతో ఎదురైనా, ఎదురుకాబోతున్న నష్టాలను వివరించారు. కేసీఆర్ మాట్లాడుతున్నంత సేపు జనం ఉత్సాహం చూపారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను కేసీఆర్ తనదైన శైలిలో ప్రశ్నించినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు జనమంతా ముక్తకంఠంతో రాలేదు.. అంటూ చేతులెత్తి తెలిపారు.
రూ.2 లక్షల రుణమాఫీ అయ్యిందా, నెలకు రూ.2500 చొప్పున ప్రతి మహిళకు ఆర్థిక సాయం అందినదా?, రైతుబంధు అందరికీ వచ్చిందా, పంటకు రూ.500 బోనస్ వస్తున్నదా? కల్యాణలక్ష్మి తులం బంగారం వస్తుందా? అని కేసీఆర్ ప్రశ్నలకు రాలేదు రాలేదు.. అంటూ జనం ఏకకంఠంతో బదులిచ్చారు. ప్రధాని మోదీ ఇస్తానన్న రూ.15 లక్షలు మీ అకౌంట్లో జమ అయినయా? బేటీ పడావో.. బేటీ బచావో ఏమైనా జరిగిందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ వచ్చిందా? అంటూ బీజేపీ పరిపాలన తీరును కేసీఆర్ వాగ్బాణాలు సంధించారు.