నమస్తే తెలంగాణ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు భారీ వర్షంతో మళ్లీ తడిసిముద్దయ్యాయి. పలుచోట్ల వడ్ల గింజలు వరదలో కొట్టుకుపోయాయి. శుక్రవారం ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వడ్లు తడిసిముద్దయ్యాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మం డలం, మహబూబాబాద్ మండలం గాంధీపురం, ముడుపుగల్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి మొలకెత్తింది. గార్ల మండలం రాంపూర్ చెక్డ్యాం నుంచి వరద పొంగిపొర్లడంతో మండలంలోని 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బయ్యారం మండలంలో పందిపంపుల, మసివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జంగాలపల్లి క్రాస్రోడ్డులో జంగాలపల్లి, ఇంచర్లకు చెందిన 30 మంది రైతుల మూడువేల క్వింటాళ్ల ధాన్యం తడిసిముద్దయింది. గోవిందరావుపేట, వెంకటాపూర్, మంగపేట, ఏటూరునాగారం, ములు గు, వాజేడు, వెంకటాపురం (నూగూరు), కన్నాయిగూడెం మండలాల్లో ధాన్యం తడిసిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నీళ్లపాలైంది. ఆరబోసిన వడ్లు తడిసి మొలకెత్తుతున్నాయి. హనుమకొండ జిల్లాలో పలు మండలాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై ఆరబోసిన మక్కజొన్న, వడ్లు తడిసిముద్దయ్యాయి. వాటిని ఆరబెట్టుకునేందుకు రైతు లు నానా తంటాలు పడుతున్నారు. కొనుగోళ్లలో అధికారులు ఆలస్యం చేస్తుండటంతో ఈ దుస్థితి తలెత్తిందని రైతులు వాపోతున్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన గాలివానకు కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి పీసీసీఎస్ కొనుగోలు కేంద్రానికి భారీగా ధాన్యం రాగా, గురువారం రాత్రి కురిసిన వర్షానికి నీటిపాలైంది. వరదకు వడ్లు కొట్టుకుపోయాయి. భీమారంతోపాటు పలు గ్రామాల్లో వర్షానికి వడ్లు నీటిపాలయ్యాయి. కొన్నిచోట్ల వరి నేలకొరిగింది. దండేపల్లి మండలం కన్నేపల్లిలో అక్కల మల్లేశ్కు చెందిన బర్రె మేతకు వెళ్లి ట్రాన్స్ఫార్మర్కు తగలడంతో విద్యుదాఘాతం తో చనిపోయింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో వర్షానికి ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. పెంచికల్పేట్లో స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని, రామగుండం, వేములవాడల్లో అకాల వర్షం ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన వాన రైతన్నకు కన్నీళ్లు మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. మంథని మండలం ఆరెంద, వెంకటాపూర్, మల్లారం గ్రామాల్లో వరిచేను నేలవాలింది. మామిడి కాయలు రాలిపోయాయి. ఖానాపూర్లో గాలి దుమారానికి వరిపొలాల్లో ఎల్టీ లైన్ విద్యుత్ తీగలు తెగిపడటంతో మేతకు వెళ్లిన అమ్మకుంటి సమ్మయ్యకు చెందిన రెండు బర్రెలు కరెంట్షాక్తో మరణించాయి. గోదావరిఖనిలో వర్షం దంచికొట్టడంతో జనజీవనం స్తంభించింది. వేములవాడలో 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. 24 గంటలు దాటినా పునరుద్ధరించకపోవడంతో కొదురుపాక, దేశాయిపల్లిలో అంధకారం నెలకొన్నది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సైతం కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెదక్, సిద్దిపేట జిల్లాలో శుక్రవారం సైతం కురిసిన వానకు వడ్లు తడిసిపోయాయి. సిద్దిపేట మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దయ్యింది. దుబ్బాక, తొగుట తదితర మండలాల్లోనూ వాన కురిసింది.
శుక్రవారం కామారెడ్డి జిల్లా బీబీపేట్ సొసైటీ వద్ద డీసీఎంఎస్ ఇన్చార్జి చైర్మన్ ఇంద్రసేనారెడ్డిని నిలదీస్తున్న రైతులు
చివరికి మిగిలిందిదే.. పెద్దపల్లి జిల్లా మంథనిలో వరదనీటిలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఎత్తుతున్న రైతు
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం రెడ్డిపురం రింగ్ రోడ్డుపై శుక్రవారం తడిసిన మక్కజొన్నను ఆరబోస్తున్న రైతులు
సిద్దిపేట మార్కెట్ యార్డులో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ధాన్యం రాశులను ముంచెత్తిన వరదనీరు
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగు ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటా అయినప్పటికీ సకాలంలో లోడ్ ఎత్తక మొలకెత్తిన బస్తాల్లోని ధాన్యం
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సిద్ధాపురం, మత్లారెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద తడిసిన వడ్లును ఆరబోస్తున్న రైతులు, అటు కమ్ముతున్న మేఘాలు
పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్లో నేలకొరిగిన వరి పంట
జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీపల్లిలో ఈదురుగాలులతో శుక్రవారం కురిసిన వర్షానికి నేలవాలిన వరిపైరు