హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈసారి వ్యవసాయానికి యూరియా వినియోగం భారీగా పెరిగింది. నిరుటితో పోల్చితే ఈ ఏడాది వానకాల సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ రైతులు 1.29 లక్షల టన్నులు అధికంగా యూరియాను వినియోగించారు. నిరుడు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 9.05 లక్షల టన్నుల యూరియాను వినియోగించగా.. ఈ ఏడాది అది 10.34 లక్షల టన్నులకు పెరిగింది. 2020-21 తర్వాత ఇదే అత్యధిక వినియోగం. 2020-21లో ఏకంగా 10.48 లక్షల టన్నుల యూరియాను వినియోగించడం గమనార్హం.
ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రైతులు రికార్డు స్థాయిలో యూరియాను కొనుగోలు చేశారు. ఆగస్టులో వర్షాలు లేకపోయినప్పటికీ అత్యధికంగా 3.42 లక్షల టన్నుల యూరియా విక్రయం జరిగింది. అప్పటి వరకు 2020-21 ఆగస్టులో విక్రయించిన 3.03 లక్షల టన్నులే అత్యధికం. ఈసారి సెప్టెంబర్లోనూ భారీగా యూరియా విక్రయం జరిగింది. నిరుడు సెప్టెంబర్లో 2.63 లక్షల టన్నులుగా ఉన్న యూరియా విక్రయం గత నెలలో ఏకంగా 3.44 లక్షల టన్నులకు పెరిగింది.
ప్రస్తుత సీజన్లో పంటల సాగు తగ్గినప్పటికీ వాతావరణ మార్పుల వల్ల యూరియా వినియోగం పెరగినట్టు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నిరుడు ఇదే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా.. ఈసారి 1.26 కోట్ల ఎకరాలకే పరిమితమైంది. కానీ, వరి సాగు మాత్రం 64.46 లక్షల ఎకరాల నుంచి 65 లక్షల ఎకరాలకు పెరిగింది. ప్రస్తుత సీజన్లో వర్షాభావ పరిస్థితులు రైతులను ఇబ్బంది పెట్టాయి. దీంతో వర్షాలు పడినప్పుడల్లా రైతులు యూరియాను చల్లారని, అందుకే యూరియా వినియోగం భారీగా పెరిగిందని అధికారులు వివరించారు.