TS-iPASS | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ పథకం (తెలంగాణ పారిశ్రామిక విధానం) విజయవంతంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. భారత్లో పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం మరోసారి తనపేరును సార్థకం చేసుకొన్నది. ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి పెట్టుబడుల వరద పారింది. నిరుడితో పోల్చుకొంటే 2022-23లో రాష్ర్టానికి దాదాపు మూడు రెట్లు అధికంగా పెట్టుబడులు సమకూరాయి.
తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు దిగ్గజ కంపెనీలు క్యూ కట్టాయి. టీఎస్ ఐపాస్ నివేదిక ప్రకారం.. 2021-22లో రాష్ట్రంలో 4,093 యూనిట్లు ఏర్పాటు కాగా, రూ. 18,893.28 కోట్లమేర పెట్టుబడులు వచ్చాయి. 2022-23లో రూ.49,579.18 కోట్ల పెట్టుబడులు రాగా.. 4,602 యూనిట్లు ఏర్పాటయ్యాయి. నిరుడు వచ్చిన యూనిట్లు అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే సుమారు 500 మాత్రమే ఎక్కువ అయినప్పటికీ.. పెట్టుబడులు మాత్రం రూ. 30 వేల కోట్లు అధికంగా రావడం విశేషం. 2021-22లో 10,1,035 ఉద్యోగావకాశాలు లభించగా, 2022-23లో 10,2,105కు పెరిగాయి. ప్రపంచంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థల నుంచి దేశీయ దిగ్గజ తయారీ సంస్థల వరకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. విభిన్న రంగాలకు చెందిన సంస్థలు రాష్ట్రంలో అడుగుపెట్టాయి. ఐటీతోపాటు ఆటోమొబైల్, వజ్రాభరణాలు, డిస్ప్లే ఫ్యాబ్, డాటా సెంటర్లు తదితర సంస్థలు ఇందులో ఉన్నాయి.
పెట్టుబడుల వివరాలు
నికోమాక్ తైకిషా క్లీన్రూమ్స్ (జపాన్), దైఫూకు (జపాన్), పేజ్ ఇండస్ట్రీస్(జాకీ బ్రాండ్), జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ (జీఈఎఫ్) (ఫ్రీడం ఆయిల్), ష్నీడర్ ఎలక్ట్రిక్ (ఫ్రాన్స్), మ్యాన్కైండ్ కన్జ్యూమర్ హెల్త్కేర్, 3ఎఫ్, రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎఫ్పీఎల్), ప్రీమియర్ ఎనర్జీస్, వెమ్ టెక్నాలజీస్, ఆశీర్వాద్ పైప్స్ (అలియాక్సిస్ గ్రూపు), ఫెర్రింగ్ ఫార్మా (స్విట్జర్లాండ్), ఈఎంపీఈ (స్వీడన్), భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ (బీఎస్వీ), ఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీస్, ఎంఆర్ఎఫ్, అడ్వాన్స్ ఆటోపార్ట్స్, జాంప్ ఫార్మాస్యూటికల్స్ (కెనడా), సహజానంద్, థర్మో ఫిషర్, డ్రిల్మెక్ (ఇటలీ), వెల్స్పన్ ఫ్లోరింగ్, వెల్స్పన్ అడ్వాన్స్ మెటీరియల్స్, ఒలెక్ట్రా గ్రీన్టెక్, హిందుస్థాన్ కోకాకోలా, ప్లాంట్ లిపిడ్స్, పల్స్ ఫార్మా, అదానీ డిఫెన్స్, యంగ్వన్, గణేషా ఎకోస్పేర్.
ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న రెండో అతిపెద్ద క్యాంపస్ నిర్మాణానికి ఏప్రిల్ 2022న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇలా పదుల సంఖ్యలో ప్రపంచ స్థాయి సంస్థలకు సెకండ్ క్యాంపస్ హైదరాబాదే.