పట్నా: బీహార్ సీఎం నితీశ్కుమార్పై లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నితీశ్ కుమార్ ఎప్పుడూ దళిత వ్యతిరేక భావజాలంతో ఉంటారని, ఇప్పుడు కుట్రతో తన పార్టీని చీల్చారని, గతంలో జితన్రామ్ మాంఝీ విషయంలో కూడా కుట్రతో వ్యవహరించారని చిరాగ్ విమర్శించారు. ఎల్జేపీని చీల్చి నష్టపరచాలన్నదే సీఎం నితీశ్ ఉద్దేశమని ఆయన మండిపడ్డారు.
కుల్లు, కుతంత్రాలతో కూడిన నితీశ్ కుమార్ రాజకీయ విధానాలకు తామెప్పుడూ మద్దతివ్వమని, తమకంటూ ఒక రాజకీయ అజెండా ఉన్నదని, దాని ప్రకారమే నడుచుకుంటామని చిరాగ్ పాశ్వాన్ స్పష్టంచేశారు. ఇప్పుడు నితీశ్కు, తనకు మధ్య జరుగుతున్న పోరు మహాభారతం వంటిదని పేర్కొన్నారు. నితీశ్ కుట్రలు తననేమీ చేయలేవని చెప్పారు.
నితీశ్ కుమార్ ఎల్జేపీని నామరూపాల్లేకుండా చేయడానికి ఎన్ని కుట్రలు చేసినా సఫలం కాలేరని చెప్పారు. మహాభారతంలో కౌరవులు ఎందరున్నా పాండవులదే విజయమని, అదేవిధంగా అంతిమ విజయం తమదే అవుతుందని చిరాగ్ ధీమా వ్యక్తంచేశారు. పార్టీ జాతీయ కార్యవర్గంలో 90 శాతం మంది తనతోనే ఉన్నారని చిరాగ్ చెప్పారు. అతి త్వరలోనే నితీశ్ను ఎండగడుతామని, ఆయన కుట్రలు అందరికీ తెలిసేలా చేస్తామని హెచ్చరించారు.