హైదరాబాద్ : భారీ వర్షాలకు గోదావరి మహోగ్రరూపం దాల్చింది. వర్షాలు తగ్గినా వరద పోటెత్తుతున్నది. గంట గంటకు నీటి ప్రవాహం ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నది. భద్రాచలం వద్ద ప్రవాహం 70 అడుగుల మార్క్ను చేరింది. ప్రస్తుతం ఎగువ నుంచి గోదావరికి 23.70లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. చరిత్రలో తొలిసారిగా మూడోసారి గోదావరి నదిలో నీటి ప్రవాహం 70 అడుగుల మార్క్ను చేరింది. ప్రస్తుతం నదిలో 70.10 అడుగుల మేర ప్రవాహం కొనసాగుతుంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తుతున్నది. ఈ భారీ వర్షాల కారణంగా రికార్డు స్థాయిలో 70 అడుగులకు చేరింది. ఇంత పెద్ద ఎత్తున గోదావరిలో వరద రావడం చరిత్రలో ఇది మూడోసారి. ఇంతకు ముందు 1986, ఆగస్ట్ 16న తొలిసారిగా 75.6 అడుగుల మేర నీరు ప్రవహించింది. ఆ తర్వాత 1990, ఆగస్ట్ 24న 70.8 అడుగుల మేర వరద కొనసాగింది. దాదాపు 36 సంవత్సరాల తర్వాత మళ్లీ 70 అడుగుల మార్క్ను చేరింది. అయితే గతంలో భద్రాచలం వద్ద గోదావరి 60 అడుగులకుపైగా ప్రవహించిన సందర్భాలు ఉన్నాయి. 66 అడుగులు దాటి ప్రసందర్భాలు కేవలం మూడు సార్లు మాత్రమే. ఇప్పటి వరకు 60 అడుగులపైన గోదావరి వరద కొనసాగింది ఏడుసార్లు మాత్రమే.
తొలిసారిగా 1976 జూన్ 22న 63.9 అడుగుల వద్ద గోదావరి ప్రవహించి రికార్డు క్రియేట్ చేసింది. 1983, ఆగస్టు 14న 63.5 అడుగుల వద్ద గోదావరి ఉధృతి కొనసాగింది. ఈ రెండు రికార్డులు 1986లో కనుమరుగయ్యాయి. అదే ఏడాది ఆగస్టు 16న 75.6 అడుగుల వద్ద గోదావరి ప్రవహించి చరిత్ర సృష్టించింది. 1990, ఆగస్టు 24న 70.8 అడుగుల వద్ద, 2006, ఆగస్టు 6న 66.9 అడుగులు, 2013, ఆగస్టు 3న 61.6 అడుగులు, 2020, ఆగస్టు 17న 61.6 అడుగుల వద్ద గోదావరి ప్రవహించింది. ఇదిలా ఉండగా.. 1976 నుంచి ఇప్పటివరకు 18 సార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ఒక్క జూలై నెలలోనే రెండుసార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి.
భారీ వర్షాలకు గోదావరి మహోగ్రరూపం దాల్చింది. దాదాపు 36 ఏండ్ల తర్వాత భద్రాచలం వద్ద గోదావరి 70.10 అడుగుల మేర ప్రవహిస్తోంది.. తొలిసారిగా 1986, ఆగస్ట్ 16న 75.6 అడుగుల మేర, 1990, ఆగస్ట్ 24న 70.8 అడుగుల వద్ద వరద కొనసాగింది. pic.twitter.com/HbahuDPvxu
— Namasthe Telangana (@ntdailyonline) July 15, 2022