హైదరాబాద్: నగరంలోని జింఖానా గ్రౌండ్స్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నెల 25న జరుగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. ప్రధాన గేటు నుంచి అభిమానులు ఒక్కసారిగా తోసుకురావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒకరినొకరు తోసుకోవడంతో 20 మంది సృహతప్పిపోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురవాడానికి పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. వచ్చే ఆదివారం ఉప్పల్ వేధికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు మూడో టీ 20లో తపడనున్నాయి. ఈ మ్యాచ్ టికెట్లను సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్లో హెచ్సీఏ విక్రయిస్తున్నది. దీంతో అభిమానులు పెద్దసంఖ్యలో మైదానానికి తరలివచ్చారు.
టికెట్ల విక్రయానికి సంబంధించి మొదటి నుంచి తీవ్ర గందరగోళం కొనసాగింది. మ్యాచ్ తేదీ సమీపిస్తున్నప్పటికీ ఆన్లైన్, ఆఫ్లైన్ అంటూ హెచ్సీఏ సాగదీసింది. దీంతో హెచ్సీఏ తీరుపై అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి జింఖానా గ్రౌండ్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని అధ్యక్షుడు అజారుద్దీన్ ప్రకటించారు.