బైకులకు 75% వరకు తగ్గింపు
ఆన్లైన్లో చెల్లింపునకు లింక్
మార్చి 1వ తేదీ నుంచి అమలు?
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 : ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనదారులకు శుభవార్త. పేరుకుపోయిన ఈ-చలాన్లు క్లియర్ చేసుకునేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ రాయితీలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ద్విచక్ర వాహనదారులు, ఆటోవాలాలు పెండింగ్లో ఉన్న జరిమానాల్లో 25 శాతం చెల్లించి, 75 శాతం రాయితీ పొందవచ్చు. తోపుడు బండ్లపై ఉన్న చలాన్ల మొత్తంలో 20 శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగతా 80 శాతం రాయితీ. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు 30 శాతం చెల్లించవచ్చు. మిగతా 70 శాతం రాయితీ ఇస్తారు. కార్లు, తదితర వాహనదారులు 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది. వీరికి 50 శాతం రాయితీ ఇచ్చేందుకు హైదరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సూచనప్రాయంగా అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. వాహనదారులు ఈ రాయితీలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.