Komuravelli | కొమురవెల్లి మల్లికార్జునస్వామి (Mallikarjuna Swamy) ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో వారం ఆలయానికి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించారు. ‘మమ్మేలు మల్లన్న సామి, కొరమీసాల సామికి కోటి దండాలు’ అంటూ మల్లికార్జునుడి నామస్మరణతో క్షేత్రం మార్మోగుతున్నది. పట్నాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
భక్తులకు అన్ని సౌకర్యాలను ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం నుంచి భక్తులు ఆర్టీసీ బస్టాండ్, ప్రైవేట్ వాహనాల్లో ఆలయానికి తరలివచారు. వేకువ జాము నుంచే స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా కనిపించింది. ప్రత్యేక దర్శనం, శీఘ్ర దర్శనం, ధర్మ దర్శనం క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ జంట నగరాలతో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్తో పాటు పలు జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.