ఊగిపోయిన చెట్టూ పుట్ట
మేడారం గద్దెకు చేరిన సమ్మక్క తల్లి
ఎదురేగి స్వాగతం పలికిన భక్తులు
దారిపొడవునా పసుపు, కుంకుమల ముగ్గులు.. యాట బలుల మొకులు
లక్షలాది భక్తుల జయజయధ్వానాలు
ఏకే-47 కాల్పులతో తల్లికి స్వాగతం
ఎదురెళ్లి స్వాగతం పలికిన మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్
నేడు అమ్మవార్ల దర్శనానికి రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్
పుట్టతేనంత చక్కని తీర్థం అడవి తల్లుల రాకతో పులకించిపోయింది. చెట్టు, పుట్ట, వాగు, కొండ.. వాటన్నింటి మధ్య అన్నీ మరచి.. ఆడీపాడీ, తినీతాగీ మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తజనంతో అడవి మల్లెలంత స్వచ్ఛమైన పల్లెసీమ పురివిచ్చుకొన్నది. ఎగిసిపడుతున్న ఎర్రెర్రని ధూళి వనదేవతల నుదుటన సింధూరాన్ని తీర్చిదిద్దింది.
గిరిజన యువతుల నృత్యాలు.. కోయదొరల డోలు వాయిద్యాలు.. శివసత్తుల పూనకాలు.. దారిపొడవునా ముగ్గులు, హిజ్రాల మొకులు.. అధికారుల లాంఛనాలు.. పోలీస్ ఉన్నతాధికారుల తుపాకీ కాల్పుల స్వాగతాల మధ్య సమ్మక్క తల్లి మేడారం గద్దెపైకి చేరింది.
గురువారం చిలకలగుట్ట నుంచి లక్షల మంది భక్తులు, ఆదివాసీల వడ్డెలు (పూజారులు) కుంకుమభరిణె రూపంలో ఉన్న అమ్మను తోడ్కొని వచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్రెడ్డి అమ్మవారికి ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఎదురుకోళ్లు, నిలువెత్తు బంగారం సమర్పణలతో మేడారం వనదేవతలు సమ్మక్క సారలమ్మ భక్తులను అనుగ్రహిస్తున్నారు.
ములుగు, ఫిబ్రవరి 17 : సమ్మక్క తల్లి చిలకలగుట్ట దిగి జనం మధ్యకు వచ్చింది. భక్తులను కండ్లారా చూసుకొనేందుకు, వారిని మనసారా దీవించేందుకు మేడారం గద్దెపైకి చేరింది. ఆదివాసీ జాతరలో సమ్మక్క తల్లిని తోడ్కొని వచ్చి గద్దెలపైకి చేర్చే అద్భుత ఘట్టం గురువారం ఆవిష్కృతమైంది. ఈ పతాక సన్నివేశాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. సమ్మకను మేడారం గద్దెలపైకి చేర్చే ప్రక్రియ గురువారం ఉదయమే ప్రారంభమైంది. సమ్మక వడ్డెలు ఉదయం 10:13 గంటలకు మేడారం సమీపంలోని చిలుకలగుట్ట అడవిలోకి వెళ్లి వనం(వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక పూజా మందిరం నుంచి అడేరాల(కొత్త కుండలు)ను తెచ్చి గద్దెలపైకి చేర్చారు. అనంతరం కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మకను గద్దెపైకి తెచ్చేందుకు వడ్డెల బృందం సాయంత్రం నాలుగు గంటలకు చిలుకలగుట్టపైకి బయల్దేరింది. అప్పటికే చిలుకలగుట్ట ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని చేతపట్టుకొన్న మరుక్షణమే ప్రధాన పూజారి కొకెర కృష్ణయ్య తన్మయత్వంతో ఒక ఉదుటున చిలుకలగుట్ట దిగారు. సమ్మక్క రాకకు సూచనగా అమ్మవారిని ఆహ్వానిస్తూ ప్రభుత్వ తరఫున అధికారిక లాంఛనాల ప్రకారం ములుగు ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ ఏకే 47తో గాల్లోకి కాల్పులు జరిపారు. ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య సైతం ఏకే 47 తుపాకీ ట్రిగ్గర్ను నొకారు. ఈ శబ్దంతో ఆ ప్రాంతమంతా భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. చిలకలగుట్ట దాటే సమయంలో ఎస్పీ మరోసారి తుపాకీ కాల్పులు జరిపి సమ్మకను ఆహ్వానించారు. చిలకలగుట్ట నుంచి గద్దెల దాకా దారిపొడవునా, అడవి అంతా సమ్మక్క నామస్మరణతో మార్మోగింది. సమ్మక్క వస్తుండగా దారిలోనే భక్తులు కోళ్లను, గొర్రెలను బలిచ్చి మొక్కులు చెల్లించుకొన్నారు. శివసత్తులు పూనకాలతో శివాలూగారు. మొక్కుల కోసం తెచ్చుకొన్న ఒడిబియ్యాన్ని సమ్మక్కపై వెదజల్లారు. ఈ ప్రధాన సందర్భం సాయంత్రం 7.20 గంటల నుంచి రాత్రి 9.12 వరకు ఉద్విగ్న క్షణాల మధ్య కొనసాగింది. సమ్మక గద్దెలపైకి వచ్చే సమయంలో ఆవరణలో కరెంటు సరఫరాను నిలిపివేశారు. సమ్మక గద్దెలపైకి చేరిన తర్వాత కరెంట్ సరఫరా కొనసాగించారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తయింది. సమ్మక, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరడంతో మొకులు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి వరకు మేడారం గద్దెల ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. సమ్మక గద్దెలపైకి చేరే రోజు కావడంతో గురువారం ఒక రోజే ఏకంగా 30 లక్షల మంది మేడారానికి తరలివచ్చారు.
నేడు అమ్మవార్లను దర్శించుకోనున్న సీఎం కేసీఆర్
ములుగు, ఫిబ్రవరి 17 : ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మేడారంలో పర్యటించనున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మను సీఎం దర్శించుకోనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు మేడారం చేరుకొని అమ్మవార్లను దర్శించుకొంటారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంటారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసినట్టు మంత్రులు పేర్కొన్నారు.
మేడారం పాటను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 17 : తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ, రేఖ మీడియా ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో టెన్నిస్ క్రీడాకారిణి బోయినపల్లి రేఖ రూపొందించిన మేడారం పాటను గురువారం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ పాటకు సంగీత దర్శకుడు బోయినపల్లి అగస్త్య సంగీతం సమకూర్చారు.