(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): పర్యావరణహిత, సేంద్రియ సాగుకు ప్రోత్సాహం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం ప్రణామ్’ పథకానికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాలు వెల్లడించారు. ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా వచ్చే మూడేండ్లలో కోటిమంది రైతులు ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరించేలా కృషి చేస్తామని తెలిపారు. దీని కోసం ‘భారతీయ ప్రాకృతిక్ ఖేతీ బయో-ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్’ను తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 10 వేల బయో-ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ ఏర్పాటు, జాతీయ స్థాయి మైక్రో-ఫర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూషన్, పెస్టిసైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. కాగా, సేంద్రియ సాగు విషయంలో గత పాఠాలను విశ్లేషించుకొని ముందుకు వెళ్తే మంచిదని వ్యవసాయరంగ నిపుణులు హితవు పలుకుతున్నారు.
ఎరువుల సబ్సిడీలో భారీ కోత
ఎరువుల సబ్సిడీకి మంగళం పాడేందుకే ‘పీఎం ప్రణామ్’ పథకాన్ని తీసుకొచ్చినట్టు వాదనలు ఉన్నాయి. దీన్ని ధ్రువపరుస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరం ఎరువులపై ఇచ్చే సబ్సిడీకి కేంద్రం 22.25 శాతం కోత విధించడం గమనార్హం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై సబ్సిడీ రూ.2,25,200.16 కోట్లు ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం దీన్ని రూ.1,75,099.92 కోట్లకు తగ్గిస్తున్నట్టు నిర్మల పార్లమెంట్లో వెల్లడించారు. కాగా, సేవలు, పారిశ్రామికరంగాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ వ్యవసాయరంగమే ఆయువుపట్టు. దాదాపు 60 కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
దేశంలోని రైతుల్లో 95 శాతం చిన్న, సన్నకారు రైతులే. వీరిపై ఎరువుల భారం పడకుండా చూసేందుకు దశాబ్దాల నుంచీ ప్రభుత్వాలు ఎరువులను సబ్సిడీపై అందిస్తున్నాయి. కొన్నేండ్లుగా దేశంలో సాగుభూమి విస్తీర్ణం పెరగడంతోపాటు, వాణిజ్య పంటల సాగు అధికమై రసాయనిక ఎరువుల వాడకం కూడా పెరిగింది. ఇది ఏటా పెరుగుతూనే ఉన్నది. దాంతోపాటే ప్రభుత్వాలు ఎరువులపై ఇస్తున్న సబ్సిడీలను పెంచుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఎరువుల సబ్సిడీకి రూ.1.53 లక్షల కోట్లను కేటాయిస్తే, 2022-23లో అది రూ.2.25 లక్షల కోట్లకు చేరుకున్నది. ఈ సబ్సిడీ లేకపోతే కోట్లమంది రైతులు సాగునుంచి దూరమయ్యే ప్రమాదం ఉన్నది. కానీ, బీజేపీ సర్కారు ఆ విషయాన్ని వదిలేసి ఎరువుల సబ్సిడీ భారాన్ని వదిలించుకోవడం గురించే ఆలోచిస్తున్నది.
సబ్సిడీ నిధులు.. ప్రణామ్కు మళ్లింపు
కోట్ల ఎకరాల్లో సాగయ్యే వ్యవసాయాన్ని సమూలంగా మార్చేసేందుకు కేంద్రం అసలు నిధులే లేని పథకాన్ని తెస్తున్నది. పీఎం ప్రణావ్ు పథకానికి ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులను కేటాయించబోరు. ఎరువులపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలో కొంత మొత్తాన్ని ఈ స్కీవ్ు కోసం పక్కన పెడతారు. అంటే పరోక్షంగా ఎరువుల సబ్సిడీలో కోత మొదలవుతుందన్నమాట. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ.. అంతకుముందు విడుదల చేసిన ఎరువుల సబ్సిడీ డబ్బులో మిగులు చూపిన రాష్ట్రాలకు ప్రణావ్ు నిధుల్లో 50 శాతం గ్రాంట్లుగా విడుదల చేస్తారు. అలా ఏటా ఎరువుల సబ్సిడీని తగ్గిస్తూ.. పీఎం ప్రణావ్ుకు మళ్లిస్తూ పోతారు.
కేంద్రం తీసుకొచ్చిన ‘పీఎం ప్రణామ్’ పథకానికి ప్రోత్సాహకాలతో దేశంలో విపరీతాలు చోటుచేసుకునే అవకాశమున్నది. సేంద్రియ సాగు వైపునకు మళ్లించే ప్రయత్నం వికటించి దిగుబడులు తగ్గితే ఆహార సంక్షోభం తలెత్తనుంది. ఈ పథకం పేరిట ఇప్పటికే రైతుల సబ్సిడీలకు కోతలు మొదలవడంతో రైతులు సాగుకు దూరమయ్యే ప్రమాదమున్నది. ఇలాంటి విపరిణామాలు చోటుచేసుకుంటే దేశం అధోగతి పాలవుతుందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సేంద్రియ సాగు.. చేతులు కాల్చుకోవడమే!
సేంద్రియ సాగు ఒక్కరోజులో ఆచరించేది కాదు. చాలాకాలం క్రితమే మనదేశంలో ప్రకృతి సేద్యం వంటి సేంద్రియ సాగు పద్ధతులు అమలుచేసి చూశారు. కానీ, భారీగా ఉన్న మనదేశ జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు పండించాలంటే సేంద్రియ పద్ధతులు సరిపోవు. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడులు సాధించాలంటే రసాయనిక ఎరువులు వాడాల్సిందే. సేంద్రియ సాగు పేరుతో ఆటలాడితే పరిణామాలు ఎలా ఉంటాయో పొరుగు దేశమైన శ్రీలంకయే ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ ఒక్క నెల వ్యవధిలో సేంద్రియ సాగుకు మారాలన్న ప్రభుత్వ నిర్ణయం మొత్తం దేశమే దివాలా తీసేలా చేసింది. ప్రపంచంలోని మొత్తం వ్యవసాయంలో 1.5 శాతం భూమిలో మాత్రమే సేంద్రియ సాగు కొనసాగుతున్నది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్లో ముందూ వెనుక ఆలోచించకుండా సేంద్రియ వ్యవసాయాన్ని తీసుకొస్తే.. ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉన్నదని వ్యవసాయరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది రైతు వ్యతిరేక బడ్జెట్
కేంద్ర బడ్జెట్ పూర్తిగా రైతు వ్యతిరేక బడ్జెట్. నిరుటితో పోల్చితే ఈసారి వ్యవసాయ రంగానికి కేటాయింపులు 22% తగ్గాయి. ఎరువుల సబ్సిడీకి మంగళం పాడేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నది. ఇప్పటికే ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో రైతులపై పెట్టుబడి భారం పెరిగింది. ఉపాధి హామీ పథకానికి రూ.29,400 కోట్లు తగ్గించడం దారుణం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి ఒక రూపాయి కూడా పెంచలేదు. విఫలమైన పంటల బీమా పథకానికి రూ.1249 కోట్లు పెంచారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కేటాయించింది రూ.లక్ష మాత్రమే. సీసీఐ ఇక కనుమరుగైనట్టే. ఇది పత్తి రైతులకు తీవ్ర అన్యాయం చేయడమే. రైతులను ప్రత్యామ్నాయ ఎరువుల వైపు మళ్లించే పీఎం ప్రణామ్ పథకానికి కూడా బడ్జెట్లో ఒక రూపాయి కేటాయించలేదు.
– వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
పసుపు బోర్డు ఎక్కడ?
ఇది రైతులు, పేదలను దగా చేసి అదానీ, అంబానీలను ఆదుకొనే బడ్జెట్. గత బడ్జెట్ కన్నా రూ.30 వేల కోట్లు తగ్గించి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలనుకోవడం, తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు మొండిచేయి చూపడం సిగ్గుచేటు. కర్ణాటక అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను విస్మరించడం బాధాకరం. తెలంగాణలో జాతీయ రహదారులకు ఎనిమిదేండ్లలో రూ.25 వేల కోట్లు కేటాయించినా.. ఖర్చు చేసింది రూ.18 వేల కోట్లే. ఇది తెలంగాణ పట్ల వివక్షే. దీనిపై బీజేపీ నాయకులు ఏం సమాధానం చెప్తారు?. మోదీ అండ్ కో బ్యాచ్ తెలంగాణకు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప చేతల్లో చూపింది శూన్యమే. దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
– మంత్రి ప్రశాంత్రెడ్డి
కిషన్.,బండీ.. మనకు నిధులేవి?
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. రాష్ర్టానికి నిధులు సాధించడంలో ఘోరంగా విఫలమైన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎంపీలు తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తారు? రాజ్యాంగంపై అవగాహన లేని మోదీ.. రాష్ర్టాలను విస్మరిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఒక న్యాయం, బీజేపీయేతర రాష్ర్టాలకు ఒక న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని తొమ్మిదేండ్లుగా కేంద్రాన్ని కోరుతున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. గత ఎనిమిదేండ్లలో దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే.. రాష్ట్రానికి ఒకటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నర్సింగ్ కాలేజీల కేటాయింపులోనూ అన్యాయం జరిగేలా కనిపిస్తున్నది. ఇకనైనా బీజేపీ ఎంపీలు మౌనం వీడాలి.
తెలంగాణలో ఒక్కో మెడికల్ కాలేజీకి రూ.400 కోట్లు, నర్సింగ్ కాలేజీకి రూ.400 కోట్లు తీసుకురావాలి. ఎన్నికలున్న రాష్ర్టాలకు మాత్రమే మోదీ నిధులు కేటాయిస్తున్నారు. మొన్న గుజరాత్ ఎన్నికల ముందు రూ.1.35 లక్షల కోట్లతో అక్కడ వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. కర్ణాటకలో ఎన్నికల కోసం ఇప్పుడు రూ.5,300 కోట్లు ప్రకటించారు. అదానీ గ్రూప్ అవినీతిపై విదేశీ మీడియాలో వార్తలొచ్చే వరకు దేశం స్పందించకపోవడం బాధాకరం. కేంద్రం ఒంటెత్తు పోకడలతో రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేయాలని చూసినంత కాలం దేశం అభివృద్ధికి దూరంగానే ఉంటుంది.
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్
ఉపాధి కూలీల పొట్టకొట్టిన బడ్జెట్
ఉపాధి హామీకి నిధులు తగ్గించి కూలీల పొట్టగొట్టిన బడ్జెట్. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అత్యవసర సమస్యలకు పరిషారం చూపడంలో విఫలమైంది. పేద, మధ్య తరగతి, గ్రామీణ, రైతాంగ వ్యతిరేక బడ్జెట్. సంపన్నులపై సంపద పన్నును ఎందుకు పెంచలేదు? ఈ బడ్జెట్ గొప్పలు చెప్పుకోవడానికి తప్ప దీంతో సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. రాష్ట్ర విభజన హామీలకు ఎలాంటి నిధుల కేటాయింపులు లేవు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే అంశంపై మోదీ మాట తప్పారు. కార్పొరేట్ సంస్థలకు రూ.10 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చే బడ్జెట్.
– సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
ప్రజావ్యతిరేక బడ్జెట్
ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్. ప్రకృతి వైపరీత్యాల పరిహారం, స్థానిక సంస్థల నిధులు, మున్సిపాలిటీలకు ఇచ్చే నిధులు, ఉన్నత విద్య, ఆరోగ్యం తదితర రంగాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో రాష్ట్రానికి కోత పెట్టడం సరికాదు. రాష్ట్రంలోని సాగునీటి వనరులకు నిధులు నిరాకరించడం తెలంగాణపై వివక్ష చూపడమే. బీజేపీ పాలనలో దేశంం అప్పుల కుప్పగా మారింది. ఈ స్థితిలో దేశాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది.
– తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
కడుపు కొట్టే బడ్జెట్
రైతులు, పేదల కడుపు కొట్టి కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధంగా కేంద్ర బడ్జెట్ ఉన్నది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లన్ని ప్రజావ్యతిరేకమే. ఇది అంతకంటే అత్యంత చెత్త బడ్జెట్. వ్యవసాయ నల్లచట్టాలను వెనకు తీసుకున్నట్టే చేసి నేడు వాటిని ఆచరణలో పెట్టారు. ఉపాధి హామీకి నిధులు తగ్గించడం ఘోరం. వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించి రైతులకు అన్యాయం చేశారు. ఈ బడ్జెట్ పేదల, రైతుల, నిరుద్యోగ వ్యతిరేక బడ్జెట్. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దాదాపు రూ.100 లక్షల కోట్లు అప్పు చేసి దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారు. దేశంలో ధనవంతుల సంపద అంతకంతా పెరుగుతున్నదని, పేదలు మరింత పేదలవుతున్నారు.
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
బీసీలపై కసి తీర్చుకున్న కేంద్రం
రూ.45 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించడం విడ్డూరం. గత ఏడాది తెలంగాణ బడ్జెట్లో సీఎం కేసీఆర్ బీసీలకు రూ.5 వేల కోట్లకు పైగా కేటాయించారు. కానీ, దేశవ్యాప్తంగా 70 కోట్ల మంది ఉన్న బీసీలకు కేంద్ర బడ్జెట్లో రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించడం దారుణం. మోదీ ప్రభుత్వం బీసీల వ్యతిరేకి అని తేటతెల్లమైంది. కొన్నేండ్లుగా కేంద్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. బీసీల సత్తా మోదీకి రుచిచూపిస్తాం. బీసీ వ్యక్తి ప్రధానిగా ఉన్నప్పటికీ బీసీలపై వివక్ష కొనసాగుతున్నది.
– ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
మద్దతు ధరల ప్రస్తావన లేదు
కేంద్ర బడ్జెట్లో పంటలకు మద్దతు ధరల ప్రస్తావన లేదు. 23 పంటలకు ఎంఎస్పీ ప్రకటించినా కొనుగోలు చేసేది వరి, గోధుమలు మాత్రమే. గ్రామాల్లో పత్తి పంట నిల్వకు గిడ్డంగులు, కోల్డ్స్టోరేజీల నిర్మాణం గురించి లేదు. నీటి ఆదా, పంటల మార్పిడి, చిరుధాన్యాల సాగుకు ఏ మాత్రం ప్రోత్సాహకాలు లేవు. పాల ఉత్పత్తి, పశువుల పెంపకానికి మేతపై పన్ను తగ్గింపు, సబ్సిడీ లేదు. మొత్తంగా బడ్జెట్లో వ్యవసాయానికి ప్రాధాన్యం శూన్యం.
– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ
ఎన్నికల స్టంట్ బడ్జెట్
కేంద్ర బడ్జెట్పై ఏపీ ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. ఇది దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగే 9 రాష్ట్రాలకు పెద్దపీట వేసి రూపొందించిన బడ్జెట్. దీంతో సామాన్య ప్రజలకు ఒరిగింది శూన్యం. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు నిధుల ఊసే లేదు. ఏపీ నుంచి ఎంపికైన ఎంపీలు విభజన చట్టంలోని హామీలను సాధించడం మానేసి అస్త్ర సన్యాసం చేశారు. ఇది ఏపీ ప్రజలకు అన్యాయం, ద్రోహం చేయడమే.
– రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి