హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘హోటళ్ల తిండి.. మోటర్ల నిద్ర’ అనేది తెలంగాణలో ఫేమస్ సామెత. ఏపూటకు ఆ పూట అన్నట్టుగా బతికేవాళ్లను ఉద్దేశించి ఈ సామెత చెప్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సామెత అతికినట్టు సరిపోయేలా ఉన్నది. ఎనిమిదేండ్లుగా పాలన సాగిస్తున్న 56 ఇంచుల ఛాతి ఉన్న పాలకులు కనీసం ప్రజల అవసరాలేమిటో కూడా తెలియకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ముందుకు పోతున్నారు. 140 కోట్ల మంది ఉన్న మనదేశంలో ప్రజలందరికీ సరిపడినన్ని ఆహార ధాన్యాలు నిల్వ ఉంచటం కేంద్ర ప్రభుత్వ అతి ముఖ్యమైన విధి.
కానీ, బీజేపీ పాలకులకు దేశంలో ధాన్యం నిల్వ సామర్థ్యం ఎంత? ఏ కాలంలో ఎంత పంట వస్తున్నది? దేశ అవసరాలకు ఏటా ఎన్ని తిండి గింజలు అవసరం? తీవ్ర ఒడిదుడుకులతో ఉండే దేశ వ్యవసాయ రంగంలో ఏమైనా అలజడులు వస్తే ఎలా ఎదుర్కోవాలి? భవిష్యత్తు అవసరాల కోసం ఎలా సిద్ధం కావాలి? అన్న సోయి కూడా కేంద్రానికి లేకుండా పోయింది. నాలుగేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయని ఏడాది క్రితమే గప్పాలు కొట్టిన కేంద్రం.. ‘ఇప్పుడు ధాన్యం ఇవ్వండి మహా ప్రభో’ అనే పరిస్థితి తెచ్చుకొన్నది. ముఖ్యంగా గత యాసంగిలో తెలంగాణ నుంచి ధాన్యం సేకరించేందుకు ససేమిరా అన్న మోదీ సర్కారు.. వచ్చే యాసంగిలో తెలంగాణే దిక్కు అనాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యాసంగిలో తెలంగాణలో అధిక పంట
మనదేశంలో వానకాలం సీజన్లో చాలా రాష్ర్టాల్లో వరిపంట వేస్తారు. యాసంగిలో మాత్రం తెలంగాణలో మాత్రమే అత్యధికంగా వరి సాగు చేస్తారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్లో కొద్దిగా వేస్తారు. ఈ ఏడాది వానకాలం సీజన్లో దేశవ్యాప్తంగా 995 లక్షల ఎకరాల్లో (403 లక్షల హెక్టార్లు) పంట సాగైంది. గత ఏడాది వానకాలంతో పోల్చితే ఇది 49 లక్షల (20 లక్షల హెక్టార్లు) ఎకరాలు తక్కువ. ఈ ఏడాది రుతుపవనాలు సరైన సమయంలో రాకపోవటంతో వరి సాగు భారీగా తగ్గింది. ఈ మేరకు ఉత్పత్తి కూడా తగ్గనున్నది. 2021-22 వానకాలం సీజన్లో దేశంలో 11.2 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి అయ్యింది.
2022-23 వానకాలం సీజన్లో ఏకంగా 70 లక్షల టన్నులు తగ్గి 10.5 లక్షల టన్నులకే పరిమితం అవుతుందని అధికారులు ముందస్తు అంచనాల్లో పేర్కొన్నారు. దీంతో కేంద్రంలో వణుకు మొదలైంది. ఈ ఏడాది వానకాలం సీజన్ దాదాపు ముగిసింది. ఇప్పుడు యాసంగి సీజన్ మొదలవుతున్నది. యాసంగిలో వరికి కేరాఫ్ తెలంగాణ రాష్ట్రమే. 2021-22 యాసంగిలో తెలంగాణలో 34.21 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 2022-23 యాసంగిలో మరో ఐదు లక్షల ఎకరాల్లో అధికంగా సాగవుతుందని భావిస్తున్నారు. అంటే దాదాపు 40 లక్షల ఎకరాల్లో వరి వేస్తారని రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుత వానకాలంలో తెలంగాణలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. దీంతో 1.41 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ఇందులో 90 లక్షల టన్నులు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నది. ఇప్పటికే 28 లక్షల టన్నులు సేకరించింది కూడా.
వద్దన్న పారాబాయిల్డే ముద్దు
యాసంగిలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంవల్ల వరి ధాన్యం మరాడిస్తే నూక శాతం అధికంగా వస్తుంది. అందువల్లనే పారాబాయిల్డ్ రూపంలో బియ్యం ఉత్పత్తి చేస్తారు. గత యాసంగిలో కూడా రాష్ట్రంలో పంట అధికంగా రావటంతో పారాబాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఆ బియ్యం తీసుకొనేందుకు కేంద్రం ఒప్పుకోలేదు. భవిష్యత్తులో కూడా పారాబాయిల్డ్ రైస్ తీసుకోబోమని, తెలంగాణ రైతులను వేరే పంటలు వేసుకొనేలా ప్రోత్సహించాలని ఉచిత సలహా కూడా పడేసింది. ఆ తర్వాత కొంత కాలానికే ప్రపంచవ్యాప్తంగా బియ్యానికి డిమాండ్ పెరగటంతో దేశంలోనూ పెరిగింది. దీంతో అధిక మొత్తంలో బియ్యం కావాలని తెలంగాణను కేంద్రం కోరింది.
గత జూలైలో 8 లక్షల టన్నులు అధికంగా పారాబాయిల్డ్ బియ్యం తీసుకొనేందుకు ముందుకొచ్చింది. నిజానికి కేంద్రం కిరికిరితో విసిగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర రైతులు నష్టపోకుండా ముందస్తుగానే యాసంగిలో ఇతర పంటలు వేసుకోవాలని సూచించింది. అయినా, చాలామంది రైతులు వరివైపే మొగ్గు చూపారు. ఈ యాసంగికి కూడా అదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అంటే ఈ యాసంగి కూడా తెలంగాణలోనే బియ్యం అధికంగా వస్తాయి. దేశవ్యాప్తంగా సాగు, దిగుబడి పడిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణను అడుక్కోవటం తప్ప మరో మార్గం లేదని వ్యవసాయార్థిక నిపుణులు చెప్తున్నారు.
గత ఏడాది యాసంగి
‘మా రాష్ట్రంలో వరి దిగుబడి భారీగా వచ్చింది. యాసంగిలో బాయిల్డ్ రైస్ అధికంగా వస్తుంది. వీలైనంత ఎక్కువ సేకరించండి’ అని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కోరినా కేంద్రంలోని బీజేపీ సర్కారు కనీసం పట్టించుకోలేదు. నాలుగేండ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని, బాయిల్డ్ రైస్ ఎవరూ తినటంలేదని, ఒక్క గింజ కూడా తీసుకోబోమని తెగేసి చెప్పింది. ఇకపై ఎన్నడూ యాసంగి బియ్యం, వడ్లు తీసుకోబోమని స్పష్టంచేసింది. పైగా ‘తెలంగాణ ప్రజలకు నూకలు తినటం నేర్పించండి’ అంటూ కేంద్ర మంత్రి పీయూష్గోయల్ దారుణంగా అవమానించారు.
ఈ ఏడాది యాసంగి
ఏడాది తిరక్కుండానే పరిస్థితి తిరగబడింది. ‘వచ్చే యాసంగిలో ఎంత వరి ధాన్యం దిగుబడి వచ్చినా తీసుకొంటం’ అనే పరిస్థితికి కేంద్రం దిగివచ్చింది. దేశవ్యాప్తంగా ఈ వానకాలమే వరిపంట సాగు తీవ్రంగా పడిపోయింది. ఇక యాసంగిలో నామమాత్రంగా కూడా వరిసాగు కష్టమే. తెలంగాణలో మాత్రమే యాసంగిలో భారీగా వరిసాగు అవుతున్నది. దీంతో ఒకప్పుడు తూలనాడిన రాష్ర్టానికే బియ్యం కోసం కేంద్రం రావాల్సిన పరిస్థితి వస్తున్నది.