హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీకి మరో షాక్ తగిలింది. పద్మశాలీ సంఘం నాయకుడు, సీనియర్ జర్నలిస్టు, మాజీఎంపీ రాపోలు ఆనంద భాసర్ ఆ పార్టీని వీడనున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడం పట్ల ఆనందభాస్కర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేనేతపై 5% జీఎస్టీ విధించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకొన్నారు. మరోవైపు చేనేత రంగాన్ని, నేత కార్మికులను ఆదుకొనేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆయనను ఆకర్షించాయి.
దీంతో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో భేటీ అయ్యా రు. రాష్ట్రంలో చేనేతరంగ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడం ద్వారా చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సామాజికవర్గానికి చెందిన తాను.. బీజేపీ చేస్తున్న ఈ నిర్వాకాన్ని చూస్తూ భరించలేనని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలను ప్రజలపై రుద్దారని, బీజేపీ కాంట్రాక్టర్ల పార్టీగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరుతానని సీఎం కేసీఆర్తో చెప్పారు. భారత్ రాష్ట్ర సమితి ద్వారా జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చూసి పలువురు నాయకులు అసంతృప్తితో ఉన్నారని ఆ పార్టీ నేతలే చెప్పుకొంటున్నారు. రాష్ట్రంలో బండి సంజయ్ ఒంటెత్తు పోకడలు, ఆయన కోటరీ నేతల వేధింపులు, పార్టీ కార్యక్రమాల్లో ప్రాముఖ్యం ఇవ్వకపోవడం వంటి కారణాలు వారిని మనోవేదనకు గురిచేస్తున్నాయని, ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారని చర్చింరుకొంటున్నారు. శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, పల్లె రవికుమార్, దాసోజు శ్రవణ్ వంటి బీసీ నేతలు ఇప్పటికే బీజేపీని వీడి టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు. తాజాగా ఆనంద భాస్కర్ చేరుతున్నారు. ఈ వలసలు ఇంకా కొనసాగుతాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇతర పార్టీల్లో నుంచి బీజేపీలో చేరిన నేతలంతా ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారని అంటున్నారు.
మునుగోడు ఉపఎన్నిక ముందు పార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడటం పట్ల బీజేపీ పెద్దలు పరేషాన్లో పడ్డారు. ముఖ్యంగా బీసీ వర్గాలకు చెందిన నేతలు వెళ్లిపోతుండటంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మునుగోడులో గెలిపిస్తారనే ఆశతో స్టీరింగ్ కమిటీలో నియమించిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ పార్టీని వీడటం పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. పార్టీని వీడేవారి జాబితా ఇంకా ఉన్నదని, ఇందులో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారంతో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని వణికిపోతున్నట్టు తెలిసింది.