హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎన్నికల అధికారులు చెప్తున్న లెక్కలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. ఇప్పటికే 90 శాతానికి పైగా ఓటరు స్లిప్పుల పంపిణీ జరిగినట్టు అధికారులు చెప్తుండగా.. అనేక ప్రాంతాలు, గ్రామాల్లో నేటి వరకు కూడా అందలేదని ఓటర్లు ఫిర్యాదు చేస్తున్నారు. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటర్లుండగా ఇప్పటికే మూడు కోట్ల స్లిప్పుల పంపిణీ జరిగిందని లెక్కలు చెప్తున్నారు. ఈనెల 4నాటికే జీహెచ్ఎంసీ పరిధిలోని చేవెళ్ల లోక్సభ పరిధిలో 90 శాతం, మల్కాజిగిరి, సికింద్రాబాద్లో 80 శాతం, హైదరాబాద్లో 79 శాతం ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినట్టు చెబుతున్నారు. కానీ వీటిలో సగం మంది ఇండ్లకు కూడా ఓట రు స్లిప్పులు రాలేదని ఫిర్యాదులు వస్తున్నా యి. నగరాలు, పట్టణాల్లో మున్సిపల్ సిబ్బం ది, బీఎల్వోల ఆధ్వర్యంలో, గ్రామీణ ప్రాంతా ల్లో పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బంది ఓటరు స్లిప్పుల పంపిణి చేసే బాధ్యతను అప్పగిస్తారు. పోలింగ్ తేదీకి ఐదు రోజుల ముందుగానే ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ అధికారులు ఆదేశించారు.
ఓటరు స్లిప్పులు పంపిణీ కాకపోవడంతో ఇతర మార్గాల్లో వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దానిపై ఓటర్లు దృష్టి పెడుతున్నారు. సాంకేతికంగా కొంత అవగాహన ఉన్న వారు ఓటరు హెల్ప్లైన్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనే వెసులుబాటు ఉంది. గుగూల్ ప్లేస్టోర్లో ఓటరు హెల్ప్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఓటరు సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేసి, ఆపై సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్, ఓటరు కార్డు నంబర్, ఓటరు వివరాలు ఏదైనా ఒక దాని వివరాలు ఎంటర్ చేసి మన ఓటరు స్లిప్పును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓటు వేసేటప్పుడు ఈ స్లిప్పుతో పాటుగా ఆధార్కార్డు, ఓటరుకార్డు సహా 12 రకాల గుర్తింపుకార్డుల్లో ఏదైనా ఒకటి చూపించాల్సి ఉంటుంది.