హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వరి పంటకు కాండం తొలిచే పురుగు వ్యాపించింది. ముందుగా వరినాట్లు వేసిన పొలాల్లో ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉన్నది. ఈ తెగులు ప్రభావంతో వరి పంట ఎదుగుదల నిలిచిపోవడంతోపాటు నీళ్లు ఉన్నప్పటికీ ఎండిపోయినట్టుగా పంట కనిపిస్తున్నది. ఈ పురుగు వరి పంటకు నష్టం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అవగాహన లేకుండా ఏవేవో మందులను పిచికారి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన చెందొద్దంటూ రైతులకు భరోసా ఇస్తున్నారు. సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే తెగులు అంతమవుతుందని సూచిస్తున్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ ఇతర శాస్త్రవేత్తలతో కలిసి కాండం తొలిచే పురుగు వ్యాపించిన వరి పంటల పొలాలను పరిశీలించి రైతులకు సూచనలు ఇచ్చారు.