దేశంలోని వివిధ రంగాల ప్రముఖుల సెల్ఫోన్ సంభాషణలపై స్పైవేర్ను ఉపయోగించి నిఘా పెట్టారనే వార్త దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. పలువురు క్యాబినెట్ మంత్రులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద కార్యకర్తలతో పాటు భిన్న రంగాలవారిపై గూఢచర్యం జరిగిందనేది వ్యక్తిగత గోప్యత దృష్ట్యానే కాకుండా, దేశ భద్రత రీత్యా ఆందోళనకరం. మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన సుప్రీంకోర్టు మహిళా ఉద్యోగితోపాటు ఆమె కుటుంబానికి చెందిన 11 మందిపై నిఘా పెట్టారనేది కూడా ఇప్పుడు బయటపడింది. సెల్ఫోన్ అనేది దైనందిన జీవితానికి ఒక నిలువుటద్దంలాగా, ఒక డైరీలాగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో.. ఆ సెల్ఫోన్పై ఓ సాఫ్ట్వేర్ నిఘా పెట్టిందనే వార్తలు దేశంలో సంచలనం రేపుతున్నాయి.
భిన్న రంగాల వారిపై విస్తృత స్థాయిలో నిఘా వేయడం రాజకీయ వర్గాలలో ఆందోళన సృష్టించింది. పార్లమెంటు సమావేశాలకు ఆటంకం కలిగించడానికే ఇప్పుడు ఈ నిఘా ఆరోపణలు చేస్తున్నట్టుగా హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సాగిన ఈ నిఘా ఉదంతాన్ని పరిశీలిస్తే, అబద్ధమని తేలిగ్గా కొట్టిపారేయలేం. ఈ నిఘా జరిగిందా లేదా అనే విషయమై దర్యాప్తు జరిపి వాస్తవాలను బయట పెట్టవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంటుంది. సాధారణంగా అధికారంలో ఉన్న వారు ఇటువంటి నిఘా ఏర్పాటు చేస్తుంటారు. ఈ నిఘాతో ప్రభుత్వానికి సంబంధం ఉంటే అందుకు సంబంధించిన వారు బాధ్యత వహించవలసి ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసం నిఘా వేయడమైనా, వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించడమైనా ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రభుత్వానికి ఈ నిఘా వ్యవహారంతో సంబంధం లేదంటే, మరెవరు జరిపారనేది కూడా ప్రభుత్వమే తేల్చవలసి ఉన్నది.
అతి సునిశితమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా జరపడం ఈ కాలంలో సులభమైపోయింది. విదేశాలకు చెందిన గూఢచార సంస్థలు, వ్యాపార సంస్థలు మన దేశస్థులపై నిఘావేయడం ప్రమాదకరం. ఉదాహరణకు ఆంతరంగిక భద్రత, ఎన్నికల కమిషన్ వంటి కీలక రంగాలపై వార్తలు సేకరించే విలేకరులపై నిఘా పెట్టారు. దీనివల్ల ఆయా రంగాలకు చెందిన సమాచారం విదేశాలకు చేరుతుంది. ఈ ఉదంతం నిగ్గు తేల్చడమే కాకుండా, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి జరిపే నిఘాను ఎలా అడ్డుకోవాలనేది ఆలోచించాలి. మరోవైపు ఇటువంటి నేరాలకు పాల్పడేవారిని చట్టం ముందు నిలబెట్టడం ఎలా, అవసరమైతే చట్టంలో మార్పులు చేయాలా అనేది కూడా చర్చించాలి.