మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 23 : మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని మహబూబాబాద్ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత అన్నారు. మంగళవారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు, పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మహబూబాబాద్లో ఆమె నామినేషన్ వేశారు. అనంతరం ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రతి నిరుపేదకు న్యాయం జరిగిందన్నారు. నమ్మదగని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు, దళితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి మానుకోట సభ పెట్టినప్పుడే ప్రజలు రాలేదని, అప్పుడే కాంగ్రెస్ పార్టీకి తమ పరిస్థితి ఏమిటనేది అర్థమైపోయిందన్నారు. కాంగ్రెస్ నాయకులు తండాలు, గూడేలలో తిరుగుతుంటే ప్రజలు వెంటపడి తిడుతున్నారన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం ఇప్పుడు మాట మార్చి ఆగస్టు 15న రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఒక్క పథకం కూడా ప్రజలకు మేలు చేయడం లేదన్నారు. బీజేపీ పార్టీ వివిధ మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు.
మహబూబాబాద్, ఏప్రిల్ 23 : మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోతు కవిత నామినేషన్ వేశారు. మంగళవారం పార్లమెంట్ పరిధిలోని మహబూబాబాద్, ఇల్లెందు, ములుగు, నర్సంపేట, పినపాక ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన శంకర్నాయక్, బానోతు హరిప్రియ, బడే నాగజ్యోతి, పెద్ది సుదర్శన్రెడ్డి, రేగా కాంతారావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, సత్యవతి రాథోడ్లతో కలిసి కవిత ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైత్కుమార్ సింగ్కు అందజేశారు. ప్రస్తుతం మానుకోట సిట్టింగ్ ఎంపీగా కవిత ఉన్నారు. అలాగే ఇదే నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థులుగా బానోత్ భావ్సింగ్, పోరిక శ్యామలనాయక్, ఆదార్ పార్టీ అభ్యర్థిగా జాటోత్ రవివర్మ మరోమారు నామినేషన్ దాఖలు చేశారు. ఆదివాసీ జేఏసీ ఎంపీ అభ్యర్థిగా చందా లింగయ్య సైతం నామినేషన్ దాఖలు చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ తరఫున మోకాళ్ల మురళీకృష్ణ కూడా నామినేషన్ వేశారు.
గత కేసీఆర్ ప్రభుత్వం రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందజేసిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు రైతులకు రైతుబంధు జమ చేయలేదన్నారు. యాసంగి పంటలు ఎండిపోయి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులను ఆదుకోవాలన్నారు. కేసీఆర్ నేతృత్వంలో ప్రతి తండా, గూడేనికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించారని, కాంగ్రెస్ పార్టీ వచ్చి నీటి తండ్లాట పెట్టిందన్నారు. కేంద్రంలో పదేళ్ల నుంచి ప్రధానిగా ఉన్న మోదీ నిరుపేదలకు ఏ లాభం చేయ లేదని, కార్మికులు, కర్షకులను అనేక ఇబ్బందులు పెట్టారన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలోనే గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తండాలను ప్రత్యేక జీపీలుగా చేయడంతో ఎంతో మందికి సర్పంచ్లు అయ్యే అవకాశం వచ్చిందన్నారు. మానుకోట ప్రాంత గిరిజన విద్యార్థుల కోసం మెడికల్ కళాశాల, హార్టికల్చర్, నర్సింగ్, ఇంజినీరింగ్ కళాశాలను గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ తండాకు వెళ్లి చూసినా ఇబ్బందులు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం అందరికి న్యాయం చేస్తుందన్నారు.
గత కేసీఆర్ పాలనలో ప్రతి పేదవాడికి న్యాయం జరిగిందని ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు అన్నారు. మండు వేసవిలో సైతం ఎస్సారెస్పీ కాల్వల ద్వారా చెరువులను నింపిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. ప్రతి ఎకరాకు నీరందించి రెండు పంటలు పండించారని, అన్ని పంటలకు కనీస మద్దతు ధరను గత కేసీఆర్ ప్రభుత్వం అందించిందన్నారు. సీఎం రేవంత్రెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గిందని, మానుకోటలో బహిరంగ సభ పెడితే అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. నిరుపేదలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్, ములుగు జడ్పీ చైర్ పర్సన్లు అంగోతు బిందు, బడే నాగజ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు డీఎస్.రెడ్యానాయక్, బానోతు శంకర్నాయక్, పెద్ది సుదర్శన్రెడ్డి, బానోతు హరిప్రియానాయక్, రేగా కాంతారావు తదితరులు పాల్గొన్నారు.