తొమ్మిదో రోజూ విజయవంతం
10 గంటల తర్వాత అన్నీ బంద్
నిబంధనలు పకడ్బందీగా అమలు
రోడ్లపై ముమ్మరంగా పోలీసుల తనిఖీలు
కరీంనగర్, మే 20 (నమస్తే తెలంగాణ) :లాక్డౌన్ విజయవంతంగా అమలవుతున్నది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడంతో తొమ్మిదో రోజు పోలీస్శాఖ మరింత కట్టడి చేసింది. గురువారం ఉదయం 10 గంటల తర్వాత నిబంధనలు పకడ్బందీగా అమలు చేసింది. రోడ్లపై ముమ్మరంగా తనిఖీలు చేయగా, కరీంనగర్లో సీపీ కమలాసన్రెడ్డి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. గోదావరిఖనిలో సీపీ సత్యనారాయణ, సిరిసిల్లలో ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యటించగా, అన్ని చోట్లా పోలీస్ అధికారులు తనిఖీలు చేశారు. రోడ్లపైకి అకారణంగా వచ్చిన వాహనదారులను హెచ్చరించారు. 10 గంటల లోపు ఇండ్లకు చేరుకోవాలని సూచించారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 12 నుంచి విధించిన లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతున్నది. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఇస్తుండగా, ఆ సమయంలోనే మార్కెట్లు, షాపుల, వాణిజ్య సముదాయాల వద్ద సందడి కనిపిస్తున్నది. ఆ తర్వాత లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతున్నది. 9.30 గంటల నుంచే పోలీసులు రంగంలోకి దిగి, వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో తిరుగుతూ, దుకాణాలు మూసివేయాలని మైకుల ద్వారా చెబుతున్నారు. పది దాటిన తర్వాత రోడ్లపై పర్యవేక్షిస్తున్నారు. గురువారం నుంచి మరింత కట్టడి చేస్తున్నారు. రోడ్లపై కనిపించిన వాహనదారులను ఆపి తనిఖీలు చేశారు. అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. సరైన సమాధానం లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపించింది.
పర్యవేక్షించిన ఉన్నతాధికారులు
లాక్డౌన్ అమలు తీరును ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు స్వయంగా పర్యవేక్షించారు. డీజీపీ ఆదేశాలతో మరింత పకడ్బందీగా వ్యవహరించారు. గురువారం కరీంనగర్లో సీపీ కమలాసన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. బస్టాండ్, మార్కెట్ రోడ్, రాజీవ్చౌక్, నాకా చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాల్లో ప్రత్యక్షంగా తనిఖీలు చేశారు. వాహనదారుల గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. పది గంటల కంటే ముందు కూరగాయల మార్కెట్ ఏరియాలో తనిఖీలు చేశారు. ఒక చోట గుమిగూడి ఉండద్దంటూ ప్రజలకు పోలీసులు, వలంటీర్లతో హెచ్చరికలు చేయించారు. గడువు దాటిన తర్వాత అత్యవసరం అయితే తప్పా బయటికి రావద్దని స్వయంగా సీపీ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖని సీతానగర్లోని కూరగాయల మార్కెట్లో రామగుండం సీపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరిశీలించారు. వ్యాపారులకు అవగాహన కల్పించారు. సిరిసిల్ల ఎస్పీ రాహుల్హెగ్డే సిరిసిల్ల, వేములవాడలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెటింగ్, హెల్ప్డెస్క్లను తనిఖీ చేశారు. అనంతరం ఆకస్మిక తనిఖీలు చేశారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. రోడ్లపై వాహనదారులతో మాట్లాడారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు.