మామిళ్లగూడెం, మార్చి 1 : ఖమ్మంలోని వెలుగుమట్ల బాధితులంతా పెయిడ్ ఆర్టిస్టులు అని విమర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా మాట మార్చారు. భూదాన్ భూముల్లో ఆక్రమణల తొలగింపులో నిరాశ్రయులైన అర్హులకు ఈ నెల 15లోగా ఇండ్ల స్థలాలు, ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం కలెక్టరేట్లో వెలుగుమట్ల బాధితులతో చర్చించారు. కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్దత్తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. భూదాన్ కూల్చివేతల్లో అర్హులైన పేదలకు ఎట్టి పరిస్థితిల్లోనూ అన్యాయం చేయబోమని స్పష్టంచేశారు. అధికారులతో పూర్తి విచారణ చేయించి నిరుపేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భూముల్లో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్న వారు ఉన్నట్టు విచారణలో తేలిందని పేర్కొన్నారు. వారిని మినహాయించి అర్హులైన పేదలకు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఇంటిస్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. వెలుగుమట్లలో ఇంటిస్థలం కోసం బాధితులు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే తిరిగి ఇప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం బాధితులు దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోయిన విషయాన్ని మీడియా ప్రతినిధులకు వివరించారు.
ఇండ్లు కోల్పోయిన వారికి పక్కా ఇండ్లు నిర్మించాలి ; సీఎంకు సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు లేఖ
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో ఇండ్ల కూల్చివేతలపై సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకొని, ఇండ్లు కోల్పోయిన వారికి పకా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆదివారం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో గత 12 ఏండ్ల నుంచి నివాసముంటున్న 700 మంది పేదల ఇండ్లు కూల్చివేయడం దారుణమని మండిపడ్డారు. పోలీసు, రెవెన్యూ సిబ్బంది కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. భూదాన యజ్ఞ బోర్డుకు చెందిన భూములని, 2014లోనే ఈ బోర్డు చైర్మన్ రాజేందర్రెడ్డి అకడి పేదలకు 100 గజాల చొప్ప్పున మంజూరు చేశారని తెలిపారు. విలువైన భూములు కావడంతో పేదలను అకడి నుంచి వెళ్లగొట్టడం సరికాదని సూచించారు.