సమర్థంగా జీవవైద్య వ్యర్థాల నిర్వహణ
వ్యర్థజలాల శుద్ధికి 20 ఎస్టీపీ ప్లాంట్లు
సీఎం కేసీఆర్ ఆదేశాలతో దవాఖానలకు కొత్తరూపు
హైదరాబాద్, మార్చి 10 : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు కొత్తరూపాన్ని సంతరించుకొంటున్నాయి. ఓవైపు అత్యాధునిక పరికరాలను సమకూర్చుకొంటూనే.. మరోవైపు పర్యావరణహితంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా వైద్యారోగ్యశాఖ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానలను మెరుగుపరుస్తున్నది. దవాఖానలకు మరమ్మతులు చేయించడంతోపాటు కావాల్సిన సిబ్బందిని, ఇతర వసతులను, అత్యాధునిక పరికరాలను సమకూరుస్తున్నది. గత ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.350 కోట్లు వెచ్చించి 30 వేలకుపైగా పరికరాలను కొనుగోలు చేసింది. వీటిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దవాఖానలకు సరఫరా చేసింది. ఈ చర్యల ఫలితంగా ప్రజావైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
రాష్ట్ర ప్రభుత్వం సబ్సెంటర్ మొదలు అన్ని స్థాయిల్లోని దవాఖానల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. సిబ్బందిని పెంచి పారిశుద్ధ్యం పెరిగేలా చర్యలు చేపట్టింది. అన్ని దవాఖానల్లో ‘బయోవేస్ట్ మెడికల్ మేనేజ్మెంట్-2016’ నిబంధనలను తూచా తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకున్నది. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో కనీస పరిశుభ్రతకు నోచుకోకుండా అధ్వాన్నంగా ఉన్న ప్రభుత్వ దవాఖానలు ఇప్పుడు పరిశుభ్రతలో ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలకు దీటుగా మెరుగయ్యాయి. ప్రత్యేకించి వైద్యారోగ్యశాఖ మంత్రిగా హరీశ్రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో సేవల నాణ్యత మరింత పెరిగింది.
వ్యర్థజలాల శుద్ధికి ఎస్టీపీ ప్లాంట్లు
దవాఖానల్లో పరిశుభ్రతను పెంపొందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు దవాఖానల నుంచి వెలువడే వ్యర్థ జలాల నిర్వహణపై దృష్టిపెట్టింది. దవాఖానల్లో వివిధ రకాల రోగాలతో బాధపడేవారు ఉంటారు. వారు వాడిన బెడ్లు, బెడ్షీట్లను, వార్డులను శుభ్రం చేసినప్పుడు వెలువడే జలాలతోపాటు ఆపరేషన్ థియేటర్ల నుంచి వెలువడే ద్రవ జీవ వ్యర్థాలు, ల్యాబొరేటరీల నుంచి వెలువడే వ్యర్థాల్లో అనేక సూక్ష్మజీవులు (బ్యాక్టీరియా, వైరస్ వంటివి) ఉంటాయి. వీటిని సరైన పద్ధతిలో శుద్ధి చేసి బయటకు వదలాల్సి ఉంటుంది. లేదంటే ఆ నీటివల్ల సమీపంలోని పరిసరాలు, నీటి వనరులు కలుషితమవుతాయి. వ్యర్థజలాల్లోని సూక్ష్మజీవుల ద్వారా ప్రజలకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉన్నది. దీనిని అరికట్టేందుకు మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోని 20 పెద్ద ప్రభుత్వ దవాఖానల్లో ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రాజీవ్శర్మ, మెంబర్ సెక్రటరీ నీతూకుమారి ప్రసాద్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఎస్టీపీలు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో దశలవారీగా ఎస్టీపీలు ఏర్పాటు కానున్నాయి.
రోజూ 66 లక్షల లీటర్ల వ్యర్థజలాల శుద్ధి
హైదరాబాద్లోని ప్రధాన దవాఖానలైన గాంధీ, ఉస్మానియా, టిమ్స్, నీలోఫర్తోపాటు మహబూబ్నగర్, సూర్యాపేట, నల్లగొండ, ఆదిలాబాద్ రిమ్స్, సంగారెడ్డి, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, జగిత్యాల, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్ ప్రభుత్వ దవాఖానల్లో ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో మొత్తం 15,450 పడకలు ఉన్నాయి. ఒక్కో దవాఖానలోని పడకల సంఖ్యను బట్టి 0.15 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నుంచి ఒక ఎంఎల్డీ వరకు సామర్థ్యమున్న ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 20 దవాఖానల్లో కలిపి 6.65 ఎంఎల్డీ సామర్థ్యమున్న ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. ఇవి రోజుకు సుమారు 66.5 లక్షల లీటర్ల వ్యర్థజలాలను శుద్ధి చేస్తాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.52.59 కోట్లు ఖర్చు చేయనున్నది. దవాఖానల్లో ఉత్పత్తయ్యే వ్యర్థ జలాలను తొలుత సూక్ష్మజీవి రహితం (డిస్ ఇన్ఫెక్ట్) చేస్తారు. ఆ తర్వాత ఎస్టీపీలకు పంపి శుద్ధి చేస్తారు. వీటిని పునర్వినియోగించుకునే స్థాయికి శుద్ధి చేసిన తర్వాత బయటికి పంపుతారు. ఎస్టీపీల నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలన్నీ పర్యావరణహితంగా మారుతాయి.