హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం గత పదేండ్లలో అద్భుత ప్రగతి సాధించిందని శ్రీలంక వాణిజ్య, పర్యావరణ శాఖల మంత్రి సతాశివన్ వియలందేరన్ కొనియాడారు. సోమవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేవలం పదేండ్లలోనే సాధించిన అద్భుత ప్రగతి గురించి గతంలో తాను శ్రీలంక పార్లమెంట్లో ప్రస్తావించిన అంశాన్ని కేటీఆర్తో పంచుకున్నారు. హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల అభివృద్ధిని సింగపూర్ను తలపించేలా ఉన్నదని ప్రశంసించారు. ఐటీ, పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ తెలంగాణను పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్గా మార్చిన తీరును సతాశివన్ అభినందించారు. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంటే పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ను అవకాశాల అక్షయపాత్రగా మార్చిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలంగాణలో ఓవైపు ఐటీ, మరోవైపు తయారీరంగం, ఇంకోవైపు ఫార్మా రంగాలకు ఏకకాలంలో పెద్దపీట వేసి పారిశ్రామిక రంగాన్ని మెరుపువేగంతో పరుగులు పెట్టించడం అరుదైన విషయమని కొనియాడారు. హైదరాబాద్ వంటి నగరాలే ఏ దేశానికైనా ఆర్థిక ఇంజిన్లని, వీటిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉం టుందని చెప్పారు. తాను చెన్నైలో పర్యటించానని, తమిళనాడు కంటే తెలంగాణ పోలీసులకే ఎకువ వేతనాలు అందుతున్నాయనే విషయాన్ని అక్కడి పోలీస్ అధికారి తనకు చెప్పిన విషయాన్ని సతాశివన్ గుర్తుచేశారు.
తెలంగాణలో గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనను ఓ యజ్ఞంలా సాగించామని, అందుకే అనతికాలంలోనే అసాధారణ ఫలితాలు సాధించగలిగామని భేటీ సందర్భంగా శ్రీలంక మంత్రి సతాశివన్కు కేటీఆర్ వివరించారు. రాష్ర్టానికి గుండెకాయ వంటి హైదరాబాద్లో సం పదను సృష్టించి సంక్షేమం రూపంలో పల్లెపల్లెనా పేదలకు పంచామని చె ప్పారు. పారిశ్రామిక రంగానికే కాదు ప ర్యావరణానికీ సమప్రాధాన్యం ఇచ్చామని, తెలంగాణలో 7.7 శాతం గ్రీన్ కవర్ను పెంచడం దేశంలోనే అరుదైన రికార్డు అని గుర్తు చేశారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం మానవ చరిత్రలోనే మూడో అతిపెద్ద ప్రయత్నమని వెల్లడించారు. చిన్న వయసులోనే శ్రీలం క ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎదిగిన సతాశివన్ను కేటీఆర్ అభినందించారు. భేటీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మా జీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.