దండేపల్లి, మార్చి 9 : అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేయగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్లో గురువారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మయ్య అనే వృద్ధుడు అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన అంత్యక్రియలకు బంధువులు, గ్రామస్థులు తరలివచ్చారు. అంతిమయాత్ర కోసం మృతదేహాన్ని ఇంటి నుంచి శ్మశానవాటికకు తరలిస్తున్నారు. శ్మశానవాటిక సమీపంలోకి రాగానే ఒక్కసారిగా తేనెటీగలు గ్రామస్థులను చుట్టుముట్టాయి. దాంతో అక్కడే వదిలా అంతా పారిపోయారు. వృద్ధులు, పిల్లలు పరుగులు పెట్టినా వదలకుండా కుట్టడంతో దాదాపు 40 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరు దండేపల్లి, లక్షెట్టిపేట దవాఖానలకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఆ తరువాత కుటుంబ సభ్యులు వెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.