హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల భద్రతే లక్ష్యంగా, నినాదంగా పనిచేస్తున్నామని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. శనివారం అసెంబ్లీలో హోంశాఖ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో హోంశాఖకు రూ.9,599 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల భద్రత, ముఖ్యంగా మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు. సంఘ విద్రోహశక్తులపై పోలీసుశాఖ ఉకుపాదం మోపుతున్నదని, గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాదారులు, నకిలీ విత్తన విక్రేతలు, చైన్ స్నాచర్లపై పీడీయాక్ట్ నమోదు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో గ్యాంబ్లింగ్, మటాను పూర్తిగా నిషేధించామని, తరచూ దాడులు, కార్డన్ సెర్చ్లు నిర్వహించి నేరాలను అదుపులోకి తీసుకొచ్చామని వివరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా పోలీసుశాఖను పునర్వ్యవస్థీకరించామని తెలిపారు. రాచకొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, సిద్దిపేట, వరంగల్లో 7 కొత్త కమిషనరేట్లు ఏర్పడ్డాయని తెలిపారు. మొబిలిటీ అండ్ విజిబిలిటీకి రూ.700 కోట్లు వెచ్చించామని వెల్లడించారు. పోలీసు శాఖకు 16,797 కొత్త, ఆధునిక పరికరాలతో వాహనాలు సమకూర్చామని చెప్పారు. రూ.584 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చామని, దీనిద్వారా లక్షకు పైగా సీసీటీవీ కెమెరాలను అనుసంధానించామని చెప్పారు. రక్షణ కోసం అత్యధికంగా సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
సైబర్ నేరాల నివారణకు చర్యలు
వేగంగా విస్తరిస్తున్న టెక్నాలజీతోపాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని, వీటి నివారణకు సైబరాబాద్, రాచకొండలో 4 సైబర్ పోలీస్స్టేషన్లు, జిల్లాల్లో సీఐడీ, సైబర్ యూనిట్లు పనిచేస్తున్నాయని మహమూద్ అలీ తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళా భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా 331 షీటీమ్స్ పనిచేస్తున్నాయని, ‘ఉమెన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ’లో హైదరాబాద్ బెస్ట్ సేఫ్ సిటీగా ఉన్నదని పేర్కొన్నారు.
సీసీ కెమెరాలతో నిత్యం నిఘా
రాష్ట్రవ్యాప్తంగా ‘నేను సైతం పథకం’ కింద 10,37,259 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని మహమూద్ అలీ వివరించారు. సీసీ టీవీల్లో ప్రపంచ టాప్ సిటీల్లో హైదరాబాద్ 16వ స్థానంలో ఉన్నదని, దేశంలోని సీసీ టీవీల్లో 64% తెలంగాణలోనే ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 30,600 కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి 28,270 పోస్టులను భర్తీ చేశామని వివరించారు. ప్రస్తుతం మరో 17,516 పోస్టులకు నియామక ప్రక్రియ తుది దశకు చేరుకున్నదని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది చర్యల ద్వారా 9.05 శాతం అగ్ని ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. కొవిడ్ పోలీసింగ్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు, నేరాలను అరికట్టడంలోనూ రాష్ట్ర పోలీసులు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారని ప్రశంసించారు.