హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రౌడీషీటర్లపై 24 గంటల నిఘా ఉంటుందని తెలిపారు. మంగళవారం సచివాలయంలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ట్రై-పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ‘నేరాలు-హత్యలు’ అంశంపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షించారు. మహమూద్ అలీ మాట్లాడుతూ.. చాంద్రాయణగుట్ట, పహాడీషరీఫ్, బండ్లగూడ ప్రాంతాల్లోని రౌడీషీటర్ల కార్యకలాపాలపై 24 గంటలూ నిఘా పెట్టాలని సూచించారు.
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ, సీపీలను ఆదేశించారు. హైదరాబాద్ పాతబస్తీలోని దుకాణాలు ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే మూతపడేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రౌడీషీటర్లు మారకుంటే పీడీ యాక్టులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే ఉపేక్షించవద్దని పేర్కొన్నారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీజీ జితేందర్, డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ, డీజీ ఆనంద్, ఏడీజీ మహేశ్భగవత్, సీపీలు తదితరులు పాల్గొన్నారు.