హైదరాబాద్ : అగ్ని ప్రమాదాలపై హోంమంత్రి మహమూద్ అలీ సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హోంశాఖ, ఫైర్ సర్వీసెస్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన భవనాల అంశంపై చర్చించారు. వాణిజ్య, నివాస భవనాలు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని, సెల్లార్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
సెల్లార్లలో వ్యాపారాలు అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు. అక్రమంగా నిర్మించిన సెల్లార్లు, భవనాల వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీగా ఉంటున్న సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో సెల్లార్లను నిర్మించి నిబంధనలకు విరుద్ధంగా సొంత వ్యాపారాలను చేస్తుండడంతో అగ్గి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని వివరించారు ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సెల్లార్లను, భవనాల వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ రకమైన నిర్మాణాలపై చేపట్టాల్సిన చర్యల గురించి ఈనెల 25న సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులతో పాటు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు తాను కూడా హాజరుకానున్నానని హోంమంత్రి వివరించారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఫైర్ సర్వీసెస్ డీజీ వై నాగిరెడ్డి, జీహెచ్ఎంసీ వీ అండ్ ఈ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ సీహెచ్ లక్ష్మీప్రసాద్, అడిషనల్ డైరెక్టర్లు నారాయణరావు, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.