జనగామ రూరల్/కొడంగల్/కోస్గి, నవంబర్ 13 : కాంగ్రెస్ హయాంలో మైనారిటీలు ఎంతో దగాకు గురయ్యారని, ఎటువంటి అభివృద్ధి లేకుండా అన్నింటా వెనుకబడినట్టు హోం మంత్రి మహమూద్ అలీ విమర్శించారు. ఆదివారం జనగామ మండలం పసరమడ్ల గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో కలిసి ముస్లింల ఆత్మీయ సమావేశం, సోమవారం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో కలిసి మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ రెండు సమ్మేళనాలకు ముఖ్యఅతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. యాభై ఏండ్లు అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్ మైనారిటీల అభ్యున్నతికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ వైఖరి కారణంగా మైనారిటీలు ఆర్థికంగా, విద్యాపరంగా ఎటువంటి అభివృద్ధిని సాధించలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ పేదంటి మైనారిటీ బిడ్డ వివాహనికి షాదీముబారక్ అందిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ కాలంలో పదుల్లో గురుకులాలు ఏర్పాటు కాగా బీఆర్ఎస్ వందల సంఖ్యలో గురుకులాలు మంజూరు చేయడంతో నిరుపేద మైనారిటీలు నాణ్యమైన కార్పొరేట్ తరహా విద్యను అభ్యసిస్తున్నట్టు చెప్పారు. 2,520 మంది మైనారిటీ పేద విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఎంతోమంది విద్యార్థులు విదేశాల్లో చదువుకునే అవకాశం సీఎం కేసీఆర్తోనే సాధ్యపడిందని కొనియాడారు. రేవంత్రెడ్డి అధికారాన్ని దక్కించుకునేందుకు పార్టీలు మారుతున్నాడని, ప్రజా సంక్షేమంపై ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో వచ్చే కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మొద్దని కోరారు. కాంగ్రెస్ను రేవంత్రెడ్డిని నమ్ముకుంటే గడ్డురోజులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ముస్లింలు కేసీఆర్కు అండగా ఉండి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. జనగామలో పల్లా రాజేశ్వర్రెడ్డిని, కొడంగల్లో పట్నం నరేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.