హైదరాబాద్: ముస్లిం ప్రపంచానికి, ముఖ్యంగా తెలంగాణ ముస్లింలకు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత రెండేళ్లతో పోల్చితే ఈ రంజాన్లో ఎలాంటి కరోనా ఆటంకాలు లేవని, షరతులు విధించలేదని వెల్లడించారు. ఈ ఏడాది రంజాన్లో ప్రజలు తమ బాధ్యతలను చాలా ప్రశాంతంగా నిర్వహించారని మంత్రి తెలిపారు. రంజాన్ మాసంలో హైదరాబాద్లో హోటళ్లు, ఇతర వ్యాపారాలు రాత్రిపూట కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిచ్చామని, అందుకు ప్రతిఫలంగా వారి వ్యాపారాలు లాభాలు గడించాయని వివరించారు.
ఈ ఏడాది 80 వేలకు పైగా ఉద్యోగ ప్రకటనలు జారీచేస్తామని, 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. యువకులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలోనే నంబర్వన్ సెక్యులర్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచిపోయారని సంతోషం వ్యక్తంచేశారు.