నిజామాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా పచ్చని రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో అధికారికంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబురాలు జరుగుతుంటే.. రాజధాని నడిబొడ్డున పోలీసుల కవాతు దేనికి సంకేతమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడైనా ఇట్లా జరిగిందా..? ఎక్కడ లేనిది తెలంగాణలోనే ఎందుకు పోలీసు కవాతు జరిపారని బీజేపీపై మంత్రి మండిపడ్డారు. నిన్నటి అమిత్ షా సభతో ప్రజలు ఎవరివైపో తేటతెల్లం అయిందని స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ‘తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో’ భాగంగా కవులు,కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధుల సన్మాన కార్యక్రమానికి ఆదివారం మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు , నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి 75 సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో సీఎం కేసీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరపాలని నిర్ణయించారన్నారు.
మొదటి రోజు జాతీయ సమైక్యత ర్యాలీలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది ప్రజలు మవ్వన్నెల జెండా చేబూని భారత జాతీయ స్ఫూర్తిని చాటారన్నారు. రెండో రోజు జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకున్నామని, మూడో రోజు స్వాతంత్య్ర సమరయోధులను, కవులను, కళాకారులను సన్మనించుకున్నామని తెలిపారు.
కేంద్ర బీజేపీ నేతలు తెలంగాణ మీద గజిని మహ్మద్ లా దండెత్తి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలు సూటిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టే తెలంగాణ మీద దండ యాత్రకు వస్తున్నారా అని ప్రశ్నించారు.
ఎందరినో ఎదిరించిన పోరాటాల గడ్డ తెలంగాణ అని, మీ జులుంను తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, బీజేపీ నేతలు ఇకనైనా తమ వైఖరి మార్చుకోవాలని మంత్రి వేముల హితవు పలికారు.