హైదరాబాద్, ఏప్రిల్ 2, చార్మినార్: ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించటంతో రాత్రి నుంచే ఉపవాసాలు ప్రారంభించాలని మక్కా మసీదు సూపరింటెండెంట్ ఖాదర్ సిద్ధిఖి ప్రకటించారు. ఈ మేరకు ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టారు. రంజాన్ మాసమంతా ముస్లింలు నిష్ఠతో ఉపవాస దీక్ష చేస్తారు. రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తూ నిత్యం దైవ ప్రార్థనలతో గడుపుతారు. రంజాన్ మాసం నేపథ్యంలో ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. నెల రోజులపాటు సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. తెలంగాణకు ప్రత్యేకమైన ‘గంగజమునా తెహజీబ్’ సంస్కృతి మరింత పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని అభిలషించారు.
మంత్రి కొప్పుల శుభాకాంక్షలు
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఎస్సీల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. ఓర్పు, సహనం, ఐకమత్యం, శాంతి, సోదరభావం, సౌభ్రాతృత్వానికి రంజాన్ ప్రతీక అని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే మసీదులు, ఈద్గాల అభివృద్ధి, మరమ్మతులకు నిధులు కేటాయించామని గుర్తుచేశారు. పండుగ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.