Cyclone Michaung | మిగ్జాం తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తెలంగాణలోనూ తుఫాను ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని విద్యాసంస్థలకు రేపు (బుధవారం) జిల్లా అధికార యంత్రాంగం సెలవు ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నీ మూసే ఉంచాలని జిల్లా విద్యాధికారి ఆదేశించారు.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తప్పనిసరిగా బుధవారం పాఠశాలల్లో తరగతులు నిర్వహించొద్దని స్పష్టం చేశారు. హాస్టల్లో ఉండే విద్యార్థిలు బయటకు రావొద్దని.. హాస్టల్స్లోనే ఉండాలన్నారు. మిగ్జాం తుఫాను ప్రభావంతో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. మరో వైపు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా అశ్వారావుపేటలో 14 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది. అలాగే దమ్మపేటలో ఎనిమిది సెంటీమీటర్ల వరకు వర్షాపాతం నమోదైంది. అలాగే, పలుమండల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి.