హెచ్ఎండీఏకు మంత్రి కేటీఆర్ సూచన
వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 : భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో హెచ్ఎండీఏ తన ఆస్తులను కాపాడుకొనేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. నానక్రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ శనివారం సుదీర్ఘంగా సమీక్షించారు. హెచ్ఎండీఏ పరిధిలో ల్యాండ్పూలింగ్ ప్రణాళికలు, లాజిస్టిక్ పార్కుల నిర్మాణం, రేడియల్ రోడ్ల బలోపేతం, మూసీ ప్రక్షాళన, మూసీపై వంతెనల నిర్మాణం, రానున్న కాలానికి హెచ్ఎండీఏ ప్రణాళిక వంటి వివిధ అంశాలపై వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ పరిధిలో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు, భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సంస్థ పరిధిలో ఉన్న చెరువుల సంరక్షణపై ప్రత్యేకంగా చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచే తమ ప్రభుత్వం చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. హైదరాబాద్ నగరం లేదా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులు ఇందుకు అతీతం కాదని అన్నారు. హెచ్ఎండీఏ సైతం ఇప్పటికే అనేక చెరువులను వేగంగా అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. గండిపేట వంటి అతిపెద్ద చెరువు వద్ద ఇప్పటికే అభివృద్ధి, సంరక్షణ కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఇది నగర ప్రజలకు ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మారుతుందని పేర్కొన్నారు.