దారికాచిన భయం
ఈ చిత్తరువు చూశారుగా! నిర్మానుష్యంగా, నిర్జీవంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం హైదరాబాద్లోని ఉప్పల్-నాగోల్ మధ్య వస్తుంది. ఉప్పల్ భగాయత్గా పేరున్న ఈ ఏరియా మూసీ ఒడ్డున గడ్డి పొలాలతో, ముండ్ల చెట్లతో నిండి ఉండేది. ఎక్కడెక్కడి నుంచో చెత్తాచెదారం అంతా తెచ్చి ఇక్కడ డంప్ చేసేవాళ్లు. చీకటి పడే వేళకు ఆకతాయిలకు అడ్డాగా మారుతుండేది. సాయంత్రాలు ఇటు రావాలంటేనే ప్రజలు భయపడేవాళ్లు. ఈ ప్రాంతాన్ని ఎంత త్వరగా దాటివేస్తే అంత మంచిదని అక్కడికి రాగానే వేగం పెంచేవాళ్లు.
మనసు దోచే ఆరామం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక… హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నది బీఆర్ఎస్ సర్కారు. హైదరాబాద్ నగరపాలక సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో ఇదే ప్రాంతంలోని ఏడున్నర ఎకరాల స్థలంలో శిల్పారామాన్ని నెలకొల్పింది. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా బొమ్మలు, చేనేత కళలకు సంబంధించిన స్టాళ్లు, పిల్లలు, పెద్దలకు ఆటవిడుపు కల్పించేలా చూడముచ్చటగా పార్కును తీర్చిదిద్దారు. ఐటీ కారిడార్కే పరిమితమైన శిల్పారామం సంబురాన్ని, నగరం తూర్పు వాకిలికి తీసుకువచ్చింది.