హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డికి ఇచ్చిన లీగల్ నోటీస్ను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా హెచ్ఎండీఏ కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని, అందులో పనిచేసే అధికారులు, శాఖల కార్యకలాపాలన్నీ మంత్రిమండలి నిర్ణయాలకు అనుగుణంగా ఉంటాయని తెలిపింది. అధికారులు ఎలాంటి రాజకీయ ప్రయోజనాలతో విధులు నిర్వహించరని పేర్కొన్నది. ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) విధానంపై హెచ్ఎండీఏ కమిషనర్గా ఉన్న ఒక అధికారిని లక్ష్యంగా చేసుకొని రేవంత్రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేశారని తెలిపింది. దీంతో రేవంత్రెడ్డికి లీగల్ నోటీసును మే నెల 25న జారీ చేసినట్టు వెల్లడించింది.
హెచ్ఎండీఏ ఇచ్చిన లీగల్ నోటీస్కు స్పందించకుండా మళ్లీ ఒక అధికారిని లక్ష్యంగా చేసుకొని పదే పదే నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టీవోటీ కోసం రూపొందించిన నిబంధనలను అనుసరించి ఓఆర్ఆర్ టీవోటీ బిడ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్టు తెలిపింది. 30 ఏండ్ల టీవోటీ అనేది మంత్రిమండలి నిర్ణయానికి అనుగుణంగా ఉన్నదని, ఎన్హెచ్ఏఐకి చెందిన రెండు బిడ్లు 30 ఏండ్ల కాలానికి ఖరారు అయ్యాయని, టీవోటీ విధానం ఇదే మొదటిసారి కాదని స్పష్టం చేసింది.
బిడ్లో పాల్గొన్న అధికారులందరూ తమ పనిని పారదర్శకంగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి నిర్వహించారని పునరుద్ఘాటించింది. రేవంత్రెడ్డి ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు నిర్ణీత గడువులోగా ప్రత్యుత్తరం ఇచ్చామని, ఓఆర్ఆర్ టీవోటీ బిడ్ ప్రక్రియకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని నిలిపివేయలేదని స్పష్టంచేసింది. హెచ్ఎండీఏ తన అధికారిక విధులను నిర్వహించడంలో బెదిరింపులకు గురి కాదని, అవసరమైన చట్టపరమైన చర్యల ద్వారా తనను, తమ అధికారులను రక్షించుకోవడానికి హెచ్ఎండీఏ అవసరమైన అన్ని చర్యలను చేపడుతుందని తెలిపింది.