యాదాద్రి, డిసెంబర్ 24 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య చరిత్ర త్రీడీ యానిమేషన్ రూపంలో భక్తులకు చేరువకానున్నది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పంచనారసింహుడి చరిత్రను దృశ్య రూపకంలో తిలకించే విధంగా ఉత్తర రాజగోపురంపై త్రీడీ యానిమేషన్ మ్యాపింగ్ ద్వారా చూపించనున్నారు. బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ సంస్థ రూపొందించిన ఈ సాంకేతికతను శుక్రవారం ట్రయల్ రన్లో పరీక్షించారు. వచ్చే ఏడాది మార్చి 28న స్వామివారి ఆలయాన్ని పునఃప్రారంభించనున్న నేపథ్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలను వైటీడీఏ కల్పిస్తున్నది. యాదాద్రిలో స్వామివారు ఉద్భవించిన తీరు, ప్రహ్లాద చరిత్ర, పంచనారసింహుడి అవతారాలు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నూతనాలయం ఉత్తర దిశ పంచతల రాజగోపురంపై స్వామివారి పంచనారసింహుడి అవతారాలను త్రీడీ సాంకేతికత ద్వారా భక్తులను చూపించనున్నారు. చిన్న పిల్లలతోపాటు వృద్ధులకు సైతం చక్కగా కనిపించేలా అధునాతన సాంకేతికతను వైటీడీఏ వినియోగించనున్నది.