Tragedy | గంగాధర, జూన్ 12 : తోడూ నీడై నిలిచిన భార్య గుండెపోటుతో మృతి చెందగా, ఆమె మరణాన్ని తట్టుకోలేక కలత చెందిన భర్త సైతం తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో సోమవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన జోగుల పోచయ్య(61), సత్తవ్వ(55) దంపతులు. పోచయ్య మూడు నెలల క్రితం పక్షవాతంతో మంచం పట్టాడు. వీరికి పిల్లలు లేకపోవడంతో సత్తవ్వ అన్నీ తానై భర్తను కన్నబిడ్డలా సాకింది.
సత్తవ్వనే కూలీ పనులు చేసుకుంటూ భర్తను పోషించుకుంటున్నది. సోమవారం ఉదయం 8.30 గంటలకు పోచయ్య శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా అతని పరిస్థితిని చూసి కన్నీరు పెట్టుకున్న సత్తవ్వ కరీంనగర్ దవాఖానకు తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది. ఇంతలోనే సత్తవ్వ కు గుండెపోటు రావడంతో మృతి చెందింది. బం ధువులు, గ్రామస్థులు సత్తవ్వకు అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. భార్య మరణాన్ని తట్టుకోలేక పోచయ్య సైతం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మృతి చెందాడు. ఇద్దరి మృతదేహాలను ఒకే దగ్గర ఖననం చేశారు. గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.