హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఎల్బీనగర్ ఫతుల్లాగూడలోని శ్మశానవాటికలు మతసామరస్యానికి ప్రతీకలుగా నిలిచాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవుల శ్మశాన వాటికలు ఒకేచోట ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజు 2,500 మందికిపైగా వివిధ కారణాలతో మరణిస్తుండగా.. దహన సంస్కారాలకు సరైన వసతులు లేక బాధిత కుటుంబాలు గతంలో తీవ్ర ఇబ్బందులు పడేవి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఫతుల్లాగూడలో ఒకేచోట హిందూ, ముస్లిం, క్త్రైసవులకు శ్మశానవాటికలను నిర్మించారు. పచ్చదనానికి ముప్పు వాటిల్లకుండా పూర్తిగా సోలార్ విద్యుత్తుతోనే దహన సంస్కారాలు నిర్వహించుకొనేలా చర్యలు చేపట్టారు. కడచూపునకు నోచుకోలేని వారి కోసం సెల్ఫోన్లో అంతిమ సంస్కారాన్ని వీక్షించేలా వసతులు కల్పించారు.