వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 6: ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుకుంటూ ఆరుతడి పంటలను సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని నీటి, భూమి శిక్షణా, పరిశోధనా సంస్థ(వాలంతరీ) ప్రధాన సంచాలకుడు డాక్టర్ రమేశ్ అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యం వల్ల విప్లవాత్మక మార్పు వచ్చిందని చెప్పారు. పదేండ్ల క్రితం బోర్లు వేయాలంటే దాదాపు 1,000 అడుగుల లోతు వరకు తవ్వాల్సి వచ్చేదని, ఇప్పుడు 150 అడుగులకే కావాల్సినంత నీరు లభిస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల నీటి కొరత తీరిందని, నీటిలో నాణ్యత, లవణాల సంఖ్య పెరిగిందని వివరించారు. ఆరుతడి పద్ధతి వల్ల సాగు మరింత పెరిగే అవకాశం ఉన్నదని వాలంతరీ రీసెర్చ్ విభాగం డైరెక్టర్ బీ కృష్ణారావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యల వల్ల సాగుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని చెప్పారు. ఇప్పుడు 90 లక్షల ఎకరాలకు పైగా సాగు నీరు అందే అవకాశం ఉన్నదని తెలిపారు.