మహబూబాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ‘నేను మహిళను, ఒక మహిళను అట్లా అనవచ్చా?’ ఇది వైఎస్ షర్మిల వేసిన ప్రశ్న. అయితే ఆమె మాత్రం ఒక మహిళగా మాట్లాడుతున్నదా? ‘వాడు, వీడు, రారా, పోరా, కొజ్జా.. ఆయన విడాకులివ్వాలి.. ఆమె విడాకులివ్వాలి.. తెలంగాణ అఫ్గనిస్తాన్.. కేసీఆర్ తాలిబాన్’ ఇవీ ఆమె వాడిన మాటలు. మహిళను అని చెప్పుకునే షర్మిల ఇలా మాట్లాడటంతో మానుకోట
భగ్గుమన్నది. గతంలో ఇలాగే తెలంగాణపై అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన సమైక్యవాది వైఎస్ జగన్పై రాళ్లవర్షం కురిపించిన మానుకోట.. ఇప్పుడు అదే వారసత్వం షర్మిలపైకి రాయి రువ్వింది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెండు రోజులుగా మానుకోట జిల్లాలో పాదయాత్ర పేరిట పర్యటిస్తున్నది. శనివారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో షర్మిల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, రాష్ట్ర ప్రభుత్వంతోపాటు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్నాయక్, ఆయన సతీమణి సీతామహాలక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే శంకర్నాయక్పై పరుష పదజాలాన్ని వాడారు. నోరుపారేసుకున్న షర్మిలపై అదే రోజు రాత్రి మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
షర్మిల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం మహబూబాబాద్ సమీపంలో బేతోలు, భజనతండా దగ్గర షర్మిల బస చేస్తున్న క్యాంపును నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు ముట్టడించాయి. మహబూబాబాద్-మరిపెడ జాతీయ రహదారి 365పై నిరసనకారులు బైఠాయించారు. షర్మిల డౌన్డౌన్ అంటూ నినదించిన వారంతా ఎమ్మెల్యే శంకర్నాయక్కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షర్మిల క్యాంపు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమె క్షమాపణ చెప్పకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహోదగ్రులయ్యారు. షర్మిల ఫ్లెక్సీని కిందపడేసి దహనం చేశారు. ఒక దశలో క్యాంపులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన జిల్లా ఎస్పీ శరత్చంద్రపవార్ ఆదేశాల మేరకు పోలీసులు ముందస్తుగా షర్మిల పాదయాత్ర అనుమతిని రద్దు చేస్తూ నోటీసు జారీ చేశారు. అనంతరం ఆమెను క్యాంపు నుంచి అరెస్ట్ చేసి పోలీస్ వాహనాల్లో తీసుకెళ్తుండగా.. ఆగ్రహించిన తెలంగాణవాదులు షర్మిల ఉన్న వాహనంపై రాళ్లు రువ్వారు.
రెండు గంటలు ఉద్రిక్తత
ఆదివారం ఉదయం 7 నుంచి 9గంటల వరకు షర్మిల క్యాంపు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ‘షర్మిల గోబ్యాక్’.. ‘షర్మిల డౌన్డౌన్’ అంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు క్యాంపు వద్దకు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బారికేడ్లు పెట్టి క్యాంపులోపలికి వెళ్లకుండా కట్టడి చేశారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే శంకర్నాయక్కు షర్మిల క్షమాపణలు చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అయినప్పటికీ షర్మిల క్యాంపు నుంచి బయటకు రాలేదు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులు షర్మిల ఫొటో ఉన్న ఫ్లెక్సీని చించి కిందపడేసి, దహనం చేశారు. అడుగడుగునా ఉద్రిక్త వాతావరణం నెలకొనటంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితిలో షర్మిలను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. అరెస్ట్ అనంతరం షర్మిల క్యాంపు కార్యాలయంలో ఉన్న టెంట్లు, ఇతర సామగ్రిని వాహనాల్లో తీసుకొని ఆమె అనుచరులు హైదరాబాద్కు తరలించారు.
హైకోర్టు షరతులు విధించినా..
తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేపట్టి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను, మంత్రులను టార్గెట్గా చేసుకుని ప్రసంగిస్తూ వస్తున్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్లి నా.. అక్కడి ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ ఇలాగే నోరుపారేసుకు ని విమర్శల పాలయ్యారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలిగా రాష్ర్టానికి ఏం చేయాలనుకుంటున్నదో అది చెప్పకుండా అధికార పార్టీపై మాటల యుద్ధానికి దిగుతున్నారు షర్మిల. వెళ్లిన ప్రతిచోటా ఆ ప్రాం త అభివృద్ధిపై మాట్లాడకుండా, అందుకు తన దగ్గరున్న ప్రణాళికేమిటో వివరించకుండా దాడి చేయటమే లక్ష్యంగా సాగుతున్నది ఆమె పాదయాత్ర. ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయి దాటి చివరకు ముఖ్యమంత్రిపై కూడా మాటల దాడికి దిగుతున్నది. ప్రభుత్వంపై ఎడాపెడా విమర్శలు చేస్తుండటంతో ఆమె పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి ఇవ్వలేదు. షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన కోర్టు షర్మిలకు కొన్ని షరతులు విధిస్తూ అనుమతినిచ్చింది. అలా మధ్యలో ఆగిపోయిన ఆమె పా దయాత్ర ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఓ వైపు కోర్టు షరతులున్నా.. షర్మిల వైఖరిలో ఏ మార్పూ రా లేదు. దీనికి నిదర్శనమే శనివారం మహబూబాబాద్లో ఆమె చేసిన విమర్శలు. హద్దుమీరి మాట్లాడితే తెలంగాణ సమాజం ఎలా ప్రతిస్పందిస్తుందనే దానికీ తాజా మానుకోట ఘటనే ఓ ఉదాహరణ.
నాడు వైఎస్ జగన్పై..
మానుకోటలో రాళ్లదాడి జరగటం ఇది రెండోసారి. రెండుసార్లూ వైఎస్ కుటుంబీకులపైనే దాడి జరిగింది. 2010 మే 28న అప్పటి సమైక్యాంధ్ర నేత, నేటి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఓదార్పు యాత్రపై మా నుకోట రైల్వేస్టేషన్లో తెలంగాణవాదులు రాళ్లవర్షం కురిపించారు. తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్య ని నాదాన్ని ఎత్తుకోవడం వల్లే జగన్ నాడు ప్రజాగ్రహా న్ని చవిచూడాల్సి వచ్చింది. వైఎస్ జగన్ యాత్ర ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు జగన్ సోదరి వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా రాళ్లదాడి జరిగి యాత్ర ఆగిపోవడం చర్చనీయాంశంగా మారింది.