Weather Alert | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): వచ్చే ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం తెలుగు రాష్ర్టాలపై ఎక్కువగా ఉండకపోవచ్చని, తెలంగాణలో ఒకటి రెండు ప్రాంతాల్లోనే ప్రభావం ఉంటుందని పేర్కొన్నది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మీదుగా వేడిగాలులు వీచే అవకాశాలున్నట్లు వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకురావొద్దని తెలిపింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో దేశంలోని ఆగ్నేయ ప్రాంతంతోపాటు దక్షిణ భారతదేశంలో ఎండలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతాయని పేర్కొన్నది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర సూచించారు.
ఉపరితల ఆవర్తన ద్రోణి ఆదివారం కేరళ నుంచి కర్ణాటక, మరాఠ్వాడా మీదుగా విదర్భ వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలోని ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 36 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. గాలిలో 054 శాతం తేమ ఉన్నట్టు పేర్కొన్నది.
సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఆదివారం రాష్ట్రంలో ఆదిలాబాద్లో 33.3, భద్రాచలం కొత్తగూడెంలో 38.6, హకీంపేటలో 33.4, దుండిగల్లో 31.5, హనుమకొండలో 35.5, హైదరాబాద్లో 34.3, ఖమ్మంలో 37.2, మహబూబ్నగర్లో 36.9, మెదక్లో 35.6, నల్లగొండలో 38.8, నిజామాబాద్లో 33.1, రామగుండంలో 36.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది.