హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఆర్మీ ఉద్యోగాల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తు నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం దాదాపు పది గంటలపాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిరుద్యోగులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్ స్టేషన్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు.
రైల్వేస్టేషన్లలో పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. రైల్వేస్టేషన్ల వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. రైల్వే స్టేషన్లలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల ఆధ్వర్యంలో బందోబస్తును కట్టుదిట్టం చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అన్ని చోట్ల పరిస్థితి అదుపులో ఉన్నదని, ముందస్తు చర్యల్లో భాగంగానే భద్రతను పెంచినట్టు వెల్లడించారు.