పత్తి, ఆయిల్పామ్, నూనెగింజల
పంటల సాగుతో లాభాలు
ప్రధాని మోదీకి అవగాహన లేదు: వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి
మార్కెట్ అవసరాలు పట్టుకోవాలి: బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల
ప్రత్యామ్నాయ పంటలకు మళ్లాలి: ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల
కరీంనగర్, మే 30 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత సీజన్లో పత్తి, ఆయిల్పాం, నూనెగింజల పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నదని, వాటిని సాగుచేస్తే లాభసాటిగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. ఈ పంటలకు కనీస ధరకు మించిన రేటు లభిస్తుందని విశ్లేషించారు. వానకాలం సాగుకు సంబంధించి సోమవారం కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో నిర్వహించిన వర్క్షాపుల్లో ఆయన మాట్లాడుతూ.. దేశానికి అవసరమైన పంటలు పండించే స్థాయికి తెలంగాణ రైతులు ఎదగాలని ఆకాంక్షించారు. డిమాండ్ ఉన్న పంటలను అధ్యయనం చేసేందుకు మార్కెటింగ్ అనాలసిస్, రిసెర్చ్ సెంటర్ను ఏర్పాటుచేశామని, నిపుణుల సూచనలు పాటిస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. వంటనూనెల దిగుమతులకు దేశం ఏటా 80 వేల కోట్లు ఖర్చు పెడుతున్నదని, తెలంగాణలో ఆ పంటలు పండిస్తే రైతులు లాభాలు పొందొచ్చని చెప్పారు. ఈసారి రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగుకు ప్రణాళికలు సిద్ధంచేశామని, నాలుగేండ్లలో 10 లక్షల ఎకరాలకు విస్తరింపజేస్తామన్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో సీఎం కేసీఆర్కు ఎవరూ సాటిరార న్నారు. వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి ప్రధానిగా ఉన్నారని విమర్శించారు.
పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి: గంగుల
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల గురించి అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి గంగుల సూచించారు. రైతులు మార్కెట్ అవసరాలను ఒడిసి పట్టుకోవాలని కోరారు.
నవీన సేద్యంవైపు మళ్లించాలి: మంత్రి కొప్పుల
రైతుబంధు సమితులు రైతులను నవీన సేద్యం వైపు నడిపించాలని మంత్రి కొప్పుల సూచించారు. రైతులు కూరగాయలతోపాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలపై దృష్టిపెట్టాలని కోరారు.
వంద దేశాల్లో వ్యవసాయం లేదు: వినోద్కుమార్
ప్రపంచంలో వ్యవసాయం చేయని వంద దేశాలు వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు. దేశంలో 156.50 కోట్ల ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి ఉన్నప్పటికీ, వ్యవసాయ ఎగుమతులు 16 శాతమే ఉన్నాయని చెప్పారు. రైతుబంధు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. పంటల దిగుబడి పెంపు, పెట్టుబడుల తగ్గింపుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. రైతుబిడ్డ కేసీఆర్ రాష్ర్టానికి సీఎం కావడం రైతుల అదృష్టమని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.