హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు హైకోర్టు (High Court) సూచించింది. పదో షెడ్యూల్ ప్రకారం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఐదేండ్ల అసెంబ్లీ గడువు దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే వ్యాజ్యాలపై సింగిల్జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ సింగిల్జడ్జి సెప్టెంబర్ 9న ఇచ్చిన తీర్పును కొట్టేయాలని అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు దాఖలు చేసిన పిటిషన్తోపాటు మరో పిటిషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నెల 12న వాదనలు ముగించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. సింగిల్జడ్జి తీర్పును రద్దు చేయాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి వాదించారు. దీనిపై బీఆర్ఎస్ తరఫు సీనియర్ న్యాయవాదులు మోహన్రావు, జే రామచందర్రావు ప్రతివాదనలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో సింగిల్జడ్జి జోక్యం చేసుకోలేదని తెలిపారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు వెళితే స్పీకర్కు పిటిషన్ తీసుకోలేదని, అందువల్లే హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు.