హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఏటీఎం చోరీ కేసుల్లో పంజాబ్కు చెందిన గుర్గగన్సింగ్, భూపేందర్సింగ్ అలియాస్ హర్జీత్సింగ్పై పీడీయాక్ట్ అమలుచేయడాన్ని హైకోర్టు సమర్థించింది. పీడీయాక్ట్లోని నిబంధనలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నది. గుర్గగన్సింగ్, హర్జీత్సింగ్పై మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ మే 1న పీడీయాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. దానిని ఆమోదిస్తూ ప్రభుత్వం గత నెల 13న జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుల తరఫున సోదరుడు హర్పీందర్సింగ్ హెబియస్కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ పీ శ్రీసుధతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారించింది. కింది కోర్టులో బెయిల్ పొందినవారు జైల్లోనే ఉన్నారని, పీడీయాక్ట్ ప్రయోగాన్ని రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. తమ పరిధిలో లేని కేసులను కూడా పరిగణనలోకి తీసుకుని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ముజీబ్కుమార్ స్పందిస్తూ.. ఏటీఎంలో నగదు నింపేటప్పుడు నమోదు చేసే పాస్వర్డ్ను నిందితులు సాంకేతిక సహకారంతో తసరించి, నిమిషాల వ్యవధిలోనే నగదును కాజేస్తున్నారని చెప్పారు. గురుగగన్సింగ్ బెయిలుపై విడుదలైన వెంటనే హర్జీత్సింగ్ను సంప్రదించి ఏటీఎంల్లో చోరీలకు ప్లాన్ చేశారని వివరించారు. హర్జీత్సింగ్ ఏటీఏం సాంకేతిక నిపుణుడిగా 15 ఏండ్లుగా పనిచేస్తున్నాడని, ఏటీఎంలు తెరవడం, నగదు నింపడం, సీసీటీవీ కెమెరాలను అమర్చడంలో ఆరితేరాడని చెప్పారు. నిందితులపై కంది గ్రామంలో రూ.30 లక్షలు, చిట్యాలలో రూ.3.42 లక్షలు, మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్లో రూ.7.82 లక్షల చొప్పున చోరీలకు సంబంధించిన కేసులు ఉన్నాయని వివరించారు. వాదనల తర్వాత హైకోర్టు, ఏటీఎంల చోరీ వ్యక్తిగతమైనదని కాబోదని స్పష్టంచేసింది. నిందితులు విడుదలైతే మళ్లీ నేరాలకు పాల్పడి సమాజశాంతికి భంగం కలిగిస్తారని పేర్కొన్నది. ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థిస్తూ పిటిషన్లను కొట్టివేసింది.