Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది. మల్టీజోన్-2 బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఈ జోన్ పరిధిలోని 13 జిల్లాల్లో బదిలీలు నిలిచిపోయాయి. అయితే, మల్టీజోన్1 పరిధిలోని 20 జిల్లాల్లోని టీచర్ల బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయి. ఇప్పటికే గెజిటెడ్ హెచ్ఎంల బదిలీలు ముగిశాయి. తాజాగా స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా (జీహెచ్ఎం) పదోన్నతులు కల్పించేందుకు సీనియార్టీ, తుది జాబితాలు, జీహెచ్ఎం పోస్టుల ఖాళీల జాబితాను విద్యాశాఖ అధికారులు బుధవారం విడుదల చేశారు. ఈ జాబితాలపై అభ్యంతరాలు తెలియజేసేందుకు గురువారం వరకు అవకాశం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా హైకోర్టు ఈ 13 జిల్లాల్లో బదిలీలు, పదోన్నతులపై స్టే విధించింది. రంగారెడ్డి జిల్లాలోని కొందరు టీచర్లు సీనియార్టీ జాబితాలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కోర్టునాశ్రయించారు. దీనిపై బుధవారం హైకోర్టులో విచారణ జరగ్గా, హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ 13 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి కొంతమంది టీచర్లు వచ్చినందున సీనియార్టీ జాబితాలను రూపొందించాలని హైకోర్టు విద్యాశాఖను ఆదేశించింది. ఈ కేసుపై అక్టోబర్ 10 వరకు స్టే విధించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా , మల్టీజోన్ -1లో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు మల్టీజోన్ -2 పరిధిలోని 13 జిల్లాల్లో కొత్త సీనియార్టీ జాబితాలను సిద్ధం చేసి, వీలైనంత త్వరగా, కోర్టుకు సమర్పించి స్టేను వెకెట్ చేయిస్తామని తెలిపారు. వారంలోపే ఈ ప్రక్రియను ముగిస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.