హైదరాబాద్, ఫిబ్రవరి14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది. బదిలీలకు రూపొందించిన నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. టీచర్ల బదిలీల కోసం జనవరి 25న జారీ చేసిన జీవో 5, దానికి సవరణలు చేస్తూ ఫిబ్రవరి 7న జారీ చేసిన జీవో 9ల అమలును నిలిపివేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం జారీచేసిన జీవోలను ఎం సక్కుబాయి సహా ఐదుగురు ఉపాధ్యాయులు కోర్టులో సవాలు చేశారు. జీవోలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని, నాన్ స్పౌజ్ టీచర్లకు తీరని అన్యాయం జరిగేలా ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదించారు. చట్ట ప్రకారం నిబంధనలు రూపొందించే అధికారం అధికారులకు ఉండదని, చట్టసభలకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ విద్యా చట్టంలోని సెక్షన్ 78, 79కి, రాజ్యాంగంలోని 309వ అధికరణకు తిలోదకాలిచ్చేలా జీవోలు ఉన్నాయని ఆరోపించారు.
320వ అధికరణం ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సంప్రదించిన తర్వాతే నిబంధనలను రూపొందించాలని, అలా కాకుండా నేరుగా నిబంధనలు రూపొందించారని చెప్పారు. గవర్నర్ అనుమతి లేకుండా నిబంధనల రూపకల్పన చేయడం చెల్లదన్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలకు మేలు జరిగేలా నిబంధనలు ఉన్నాయని తెలిపారు. బదిలీ నిబంధనలకు చట్టసభల అనుమతి పొందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. శాసనసభ అనుమతితో చేయాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చారు. ఉభయ పక్షాల వాదనలను విన్న ధర్మాసనం కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని సీఎస్ను, విద్యాశాఖ కార్యదర్శిని, డైరెక్టర్ను, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది.