హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 623 ఏఎన్ఎం పోస్టుల నియామకాన్ని నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్టీలను మాత్రమే ఏఎన్ఎంలుగా నియమించడం చట్టవ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ వనపర్తికి చెందిన బీ రమాదేవి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి శుక్రవారం విచారణ జరిపారు.
రిజర్వేషన్లను అమలు చేయడం లేదన్న పిటిషనర్ వాదనల అనంతరం హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ తదితరులను ఆదేశిస్తూ విచారణను 14కు వాయిదా వేసింది. అప్పటివరకు స్టే ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.